Supreme Court: దేశంలో చేపట్టే జనగణన (Census) ప్రక్రియలో కులగణనను మినహాయించాలంటూ దాఖలైన పిల్ (Public Interest Litigation)ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కల్లో కులాల వివరాల సేకరణ అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
జోక్యానికి కారణం లేదు: జనగణనలో కులాలవారీ వివరాలను సేకరిస్తే.. ఆ డేటాను కొన్ని ఏజెన్సీలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “జనగణన అనేది కుల ప్రాతిపదికన ఉండాలా? వద్దా? అనేది పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం. దేశంలో వెనుకబడిన తరగతుల (బీసీ) జనాభా ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది పాలనాపరమైన అంశం కాబట్టి.. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదు.” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Also read-Supreme Court: వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ప్రభుత్వ పరిధికే ప్రాధాన్యం: కులగణనపై నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ప్రభుత్వాలు తమ సామాజిక సంక్షేమ పథకాలు, విధానాల రూపకల్పన కోసం జనాభా గణాంకాలను వినియోగించుకుంటాయని పేర్కొంది. అందువల్ల ఈ ప్రక్రియను అడ్డుకోలేమని పేర్కొంటూ సదరు పిటిషన్ను కొట్టేసింది.

