Supreme Court Concern on Digital Arrest Scams: దేశవ్యాప్తంగా రోజురోజుకీ డిజిటల్ అరెస్ట్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యాపారవేత్త నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 58 కోట్లు కొల్లగొట్టారు. ఈ క్రమంలో డిజిటల్ అరెస్ట్ నేరాలపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హర్యానాలోని అంబాలాకు చెందిన ఓ కేసును సుమోటోగా స్వీకరించింది.
అమాయకులకు ఫోన్ చేసి మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని సైబర్ నేరస్థులు భయపెట్టడం లేదా మీ పేరుతో నకిలీ బంగారం, డ్రగ్స్ దొరికాయని నమ్మబలకడం లాంటి ఘటనలకు పాల్పడుతూ వారి నుంచి రూ. కోట్లు కాజేస్తున్నారు. తాము సీబీఐ, ఈడీ అధికారుమని నమ్మించడం, అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో పాటు ఫేక్ ఉత్తర్వులను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హర్యానాలోని అంబాలాలో ఒక సీనియర్ సిటిజన్ జంటను కోర్టు పత్రాలు అని చూపిస్తూ కుట్రపూరితంగా సైబర్ క్రైమ్కు పాల్పడ్డారు. వారి నుంచి రూ .1.05 కోట్లు దోచేశారు.
ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్, జాయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం డిజిటల్ అరెస్ట్ ముప్పు తీవ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన సంతకాల ఫోర్జరీలతో వ్యక్తులను మోసం చేయడమే కాకుండా న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా డిజిటల్ అరెస్టులు దెబ్బతీస్తాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు డిజిటల్ అరెస్టు మోసాలపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
73 ఏళ్ల మహిళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయికి లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పుకుంటూ మోసగాళ్లు ఆడియో మరియు వీడియో కాల్ల ద్వారా జంటను బెదిరింపులకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 3, 16 మధ్య తేదీలతో ఉన్న నకిలీ అరెస్టు, నిఘా ఉత్తర్వులపై నకిలీ కోర్టు స్టాంపులు, సీల్స్ ఉండటంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. దీంతో బహుళ బ్యాంక్ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బును బదిలీ చేసుకున్నారు.
దీంతో సుప్రీంకోర్టు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు ఒక్కటే కాదు. న్యాయపరంగా డిజిటల్ అరెస్టులను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరిగినట్లు మీడియాలో చాలాసార్లు కథనాలు వెలువడ్డాయని తెలిపింది. న్యాయపరమైన పత్రాలను ఫోర్జరీ చేయడం, అమాయకులను దోపిడీ చేయడం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసి నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది. ఈ కారణంగా డిజిటల్ అరెస్ట్ నేరాలను పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య, చర్చలు జరిపి.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు అటార్నీ జనరల్ అభిప్రాయం సహాయం కోరింది. హర్యానా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాన్ని దర్యాప్తుపై స్టేటస్ నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.


