Supreme Court on False Cases: దేశంలో పెరిగిపోతున్న తప్పుడు కేసులు, కల్పిత సాక్ష్యాధారాలు, దురుద్దేశపూర్వక విచారణలను అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. పిల్పై స్పందన తెలియజేయాలని కోరింది. న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న ఇటువంటి ఫిర్యాదుల నుంచి పౌరులకు రక్షణ కల్పించాలని పిల్ దాఖలైంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/superman-actress-valerie-perrine-passed-away/
సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. తప్పుడు ఫిర్యాదుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
తప్పుడు కేసులు పెట్టడం వల్ల శిక్ష పడుతుందనే సమాచారాన్ని పోలీస్ స్టేషన్లలో బోర్డుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని పిటిషనర్ కోరారు. తప్పుడు కేసుల బెదిరింపుల వల్ల అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఒక కుటుంబం తప్పుడు కేసుల బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, తప్పుడు కేసుల బాధితులు నేరుగా కోర్టు అనుమతితో ఫిర్యాదు చేసేలా బీఎన్ఎస్ఎస్ చట్టంలోని నిబంధనలకు సరైన భాష్యం చెప్పాలని పిటిషనర్ కోరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని, అమాయక పౌరులను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఇటువంటి చర్యలు తీసుకుంటే కోర్టు ప్రజల గొంతు నొక్కుతోందని కొందరు విమర్శించవచ్చు, కానీ నేరారోపణ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 11న జరిగే అవకాశం ఉంది.

