Supreme Court – Stray dogs: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. పౌరుల భద్రత, పరిశుభ్రతను కాపాడే ఉద్దేశ్యంతో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల పరిధిలో వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల లోపల పూర్తి చేయాలని కూడా కోర్టు స్పష్టమైన గడువు నిర్ణయించింది.
వీధి కుక్కల నియంత్రణ..
సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో మూడు ముఖ్యమైన ఆదేశాలు ఉన్నాయి. మొదటగా, అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ఆధారంగా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని, ఆ చర్యల వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని తెలిపింది. రెండవది, రాజస్థాన్ హైకోర్టు వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొంది. మూడవది, వీధి కుక్కలను రోడ్లపైనే వదిలేయకుండా వాటిని సేకరించి సంబంధిత డాగ్ షెల్టర్లలో ఉంచాలని సూచించింది.
మున్సిపల్ కార్పొరేషన్లు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి, 24 గంటలపాటు వీధి కుక్కల చలనం మీద నిఘా పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, ప్రజలు ఫిర్యాదులు చేయగలిగేలా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. ఈ చర్యల ద్వారా కుక్కల దాడులు, కాట్ల వంటి ఘటనలను తగ్గించవచ్చని కోర్టు భావించింది.
విద్యాసంస్థలు, క్రీడా సముదాయాలు..
సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టంగా తెలిపిన అంశం ఏమిటంటే, విద్యాసంస్థలు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాల్లో కుక్కలు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసే కంచెలు, గేట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోవాలి. కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ పూర్తయ్యాక వాటిని డాగ్ షెల్టర్లలో ఉంచడం తప్పనిసరి అని కోర్టు తెలిపింది.
జంతు ప్రేమికులు..
ఈ ఏడాది ఆగస్టు 11న జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్ కుక్కకాట్ల సమస్యను సీరియస్గా తీసుకుంది. అప్పట్లో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లలో ఉన్న వీధి కుక్కలను షెల్టర్ హోమ్లలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. జంతు ప్రేమికులు ఈ విషయం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేశారు.
తరువాత కొత్త ధర్మాసనం పూర్వపు ఉత్తర్వులను రద్దు చేసింది. కొత్త ఆదేశాల ప్రకారం, ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతాల్లోని కుక్కలను పట్టుకొని టీకాలు వేసి, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని తిరిగి వాటి ప్రాంతాల్లో విడిచిపెట్టాలని సూచించింది. కానీ ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా కుక్కల దాడులు కొనసాగుతుండటంతో, సుప్రీం కోర్టు మరోసారి ఈ విషయాన్ని పునఃపరిశీలించింది.
ఆగస్టు 22న జరిగిన విచారణలో కోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న సంబంధిత కేసులను తన పరిధిలోకి తీసుకుంది. రాష్ట్రాలు తక్షణమే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కానీ, మొత్తం రెండు రాష్ట్రాలు మాత్రమే కోర్టు ఆదేశాల మేరకు తమ అఫిడవిట్లను సమర్పించాయి. మిగతా రాష్ట్రాలు స్పందించకపోవడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ధర్మాసనం ఆగ్రహం..
అదే విధంగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించకపోవడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మాత్రమే ఈ విషయంలో అఫిడవిట్ సమర్పించడం గమనార్హమని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 27న జరిగిన విచారణలో, దేశంలో కుక్కకాటు ఘటనలు నిరంతరంగా జరుగుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు అభిప్రాయపడ్డదేమిటంటే, ఈ సమస్య దేశ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తోందని. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వీధికుక్కల దాడుల వల్ల దుర్భావనకు గురవుతోందని కోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని స్పష్టం చేసింది.
ధర్మాసనం “రాష్ట్ర అధికారులు వార్తాపత్రికలు చదవరా? సోషల్ మీడియా చూడరా? ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసుకోవడం లేదూ?” అంటూ ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాల కాపీలు అధికారుల డెస్క్లకు చేరకపోయినా, ఈ సమస్య తీవ్రతను వారు గ్రహించాలి అని హెచ్చరించింది.


