Supreme Court Refuses to Gag Media: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల (Dharmasthala Mass Burial Case) కేసుపై మీడియా కవరేజీని నియంత్రించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీడియాపై గాగ్ ఆర్డర్ జారీ చేయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.
కర్ణాటకలోని ధర్మస్థల దేవాలయం కార్యదర్శి డి.హర్షెంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మీడియా కవరేజీని నియంత్రించే అధికారం తమకు లేదని, ఇలాంటి అంశాలపై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ధర్మస్థల కేసు విచారణలో భాగంగా మీడియాలో వచ్చిన కథనాలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. బెంగళూరు సివిల్ కోర్టు గతంలో దాదాపు 390 మీడియా సంస్థలపై గాగ్ ఆర్డర్ విధించి, 9,000కు పైగా ఆన్లైన్ లింక్లను తొలగించాలని ఆదేశించింది. అయితే, కర్ణాటక హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. దీనిపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
“మనం స్వేచ్ఛా దేశంలో ఉన్నాం. గాగ్ ఆర్డర్లు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటాయి. అవి కేవలం అరుదైన కేసుల్లో మాత్రమే జారీ చేయబడతాయి” అని విచారణ సందర్భంగా జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు ఈ పిటిషన్పై మరోసారి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సూచించింది.


