Supreme Court on Waqf Amendment Act : వక్ఫ్ ఆస్తులపై, బోర్డుల కూర్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టం-2025కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ చట్టంలోని పలు కీలక, వివాదాస్పద నిబంధనల అమలును నిలిపివేస్తూ (హోల్డ్ చేస్తూ) సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ, ఇది రాజ్యాంగ విలువలకు దక్కిన విజయంగా అభివర్ణించింది. అసలు ఈ చట్టంలోని వివాదాస్పద అంశాలేంటి..? సుప్రీంకోర్టు వేటికి బ్రేక్ వేసింది..?
ఏమిటీ వివాదాస్పద సవరణలు :ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని నిబంధనలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
కలెక్టర్కు అధికారాలు: వక్ఫ్ ఆస్తి అని ప్రకటించిన దానిపై ఎవరైనా సవాలు చేస్తే, దాని స్థితిని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు కట్టబెట్టారు.
‘ముస్లిం’ నిబంధన: వక్ఫ్కు ఆస్తిని విరాళంగా ఇచ్చే వ్యక్తి, కనీసం గత 5 సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్నట్లు రుజువు చేసుకోవాలని నిబంధన విధించారు.
ముస్లిమేతరుల సభ్యత్వం: వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరుల సభ్యత్వంపై కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల భద్రతను ప్రమాదంలో పడేస్తాయని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన వివాదాలను రేకెత్తించేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు ఆరోపించాయి.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు : ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కలెక్టర్ అధికారాలపై స్టే: వక్ఫ్ ఆస్తుల స్థితిని నిర్ణయించే అధికారాన్ని కలెక్టర్కు ఇస్తూ చేసిన సవరణను నిలిపివేసింది.
‘5 ఏళ్ల ముస్లిం’ నిబంధనపై స్టే: ఆస్తిని విరాళంగా ఇచ్చేవారు 5 ఏళ్లుగా ముస్లింగా ఉన్నట్లు రుజువు చేసుకోవాలన్న నిబంధన అమలును కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేసింది.
బోర్డు సభ్యులపై స్పష్టత: సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లోని 20 మందిలో నలుగురికి మించి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లోని 11 మందిలో ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండరాదని స్పష్టం చేసింది.
అయితే, మొత్తం చట్టాన్ని ఆపివేయడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం తాత్కాలిక ఉత్తర్వులేనని, తుది విచారణ తర్వాత పూర్తిస్థాయి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది.
“ఈ తీర్పు, పార్లమెంటులో ఈ ఏకపక్ష చట్టాన్ని ప్రతిఘటించిన పక్షాల విజయమే కాకుండా, తమ అసమ్మతిని గట్టిగా వినిపించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులందరికీ దక్కిన మహోన్నత విజయం. సుప్రీంకోర్టు తన తీర్పుతో ఈ చట్టంలోని దుర్మార్గపు ఆశయాలను తుడిచిపెట్టింది.”
– జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో, ప్రస్తుతానికి ఈ వివాదాస్పద సవరణల అమలుకు బ్రేక్ పడింది. తదుపరి విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


