Suvendhu Adhikari As CM of West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన బీజేపీ.. అక్కడ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అనేక తర్జనభర్జనల నడుమ చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారినే కాషాయ పార్టీ సీఎంగా ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ పక్షం సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటించింది. మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి రెండుసార్లు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో, బీజేపీలో బలమైన నేతగా ఎదిగిన సువేందుకే సీఎం పదవి దక్కింది. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడించడంలో సువేందు పోషించిన పాత్రను గుర్తించిన అధిష్టానం ఆయన వైపే మొగ్గుచూపింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/national-news/line-clear-for-vijay-sarkar/
మమతా బెనర్జీకి నమ్మిన బంటులా..
గతంలో టీఎంసీ పార్టీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి ఆ పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి నమ్మిన బంటులా కొనసాగారు. అయితే, శారదా గ్రూప్ పొంజీ స్కామ్లో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు అనేక ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం0 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏకంగా సీఎంనే ఓడించడంతో దేశవ్యాప్తంగా సువేందు పేరు మర్మోగిపోయింది. అందుకే, దీదీకి చెక్ పెట్టాలంటే సువేందు వల్లే అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే 2026లోనూ దీదీపై పోటీకి సువేందునే దింపింది. ఈ ఎన్నికలోనూ దీదీకి ఓటమి తప్పలేదు. దీదీపై సువేందు ఘన విజయం సాధించడంతో కేవలం ఎమ్మెల్యేగానే కాదు సీఎం సీటును సైతం కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు, టీఎంసీ పాలన తర్వాత మొదటిసారిగా బెంగాల్లో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కమలం పార్టీ నుంచి మొదటి సీఎంగా సువేందు అధికారి రేపు (శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

