Suvendu warning to illegal immigrants: పశ్చిమ బెంగాల్లో ఇటీవలే తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. అక్రమ వలసదారులపై గురి పెట్టింది. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు బెంగాల్లోని అక్రమ వలసదారులపై సువేందు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం సువేందు అధికారి చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్ నుంచి తాము వెళ్లగొట్టకముందే మీరే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అక్రమ వలసదారులను జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయమిచ్చి, తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
Also Read: Maruti Suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. వారికి మాత్రమే..!
సరిహద్దుల్లో నిర్బంధ కేంద్రాల ఏర్పాటు..
బెంగాల్ ప్రభుత్వం “గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి” అనే నినాదంతో విదేశీయులను దేశం నుంచి పంపేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అక్రమ చొరబాటుదారులకి, సరైన పత్రాలు లేని వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించిన బంగ్లా ప్రభుత్వం.. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, అక్రమ వలసదారులపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ చేపట్టిన సమయంలోనూ సరిహద్దు నుంచి వందల సంఖ్యలో బంగ్లాదేశ్కు వెళ్లినట్లు అధికారులు వివరించారు.

