LPG Shortage Tamilnadu Government: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై నియంత్రణ విధించింది. దీంతో దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, టీ స్టాళ్లు వంటి వాణిజ్య సంస్థలు ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా విద్యుత్ స్టవ్లను వాడాలని ప్రోత్సహించింది ఈ మేరకు విద్యుత్ బిల్లులపై సబ్సిడీని ప్రకటించింది.
గ్యాస్ సంక్షోభంపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరతతో తమిళనాడులో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో యూనిట్కు రూ. 2 చొప్పున తమిళనాడు సీఎం స్టాలిన్ సబ్సిడీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎల్పీజీ సిలిండర్ల నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లకు మారే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లకు యూనిట్కు రూ. 2 చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. గ్యాస్ కొరత వల్ల వాణిజ్య సంస్థలు మూతపడకుండా ఉండేందుకు, ప్రజలపై అదనపు భారం పడకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు విద్యుత్ స్టవ్లు,, హీటర్ల వంటి పరికరాలను కొనుగోలు చేసేందుకు నిరుద్యోగ యువత ఉపాధి కల్పన పథకం (UYEGP) కింద రుణాలు మంజూరు చేస్తారు. దీనిపై 25 శాతం సబ్సిడీ కూడా పొందవచ్చు. గ్యాస్ కొరతతో గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నెలలో అదనంగా 3,228 కిలో లీటర్ల కిరోసిన్ను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/arjun-das-shares-heartbreaking-post-goes-viral-on-social-media/
కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో హోటళ్ల నుంచి రైతులకు కూరగాయల డిమాండ్ తగ్గింది. దీంతో రైతులు నష్టపోతున్నారు. డిమాండ్ తగ్గడం వల్ల కూరగాయల విక్రయాలకు ఆటంకం కలగకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ఎటువంటి ఆంక్షలు లేకుండా పంటను అమ్ముకోవడానికి రైతులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

