Cough Syrup Sresan Pharma Company Closed: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్రం, కోర్టులు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. కాగా, తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
పసిపిల్లల అకాల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. అంతేకాకుండా కంపెనీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని డ్రగ్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కోల్డ్రిఫ్ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ దగ్గు మందు తీసుకున్న 22 మంది చిన్నారులు చనిపోవడంతో.. ఈ కంపెనీలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సిరప్లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించడం సంచలనం కలిగించింది. అంతేకాకుండా ఈ సిరఫ్ తయారీలో సరైన తయారీ పద్ధతులు అవలంబించడం లేదని వెల్లడైంది. ఇంకా 300కు పైగా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కంపెనీ యజమాని జి. రంగనాథన్ను అరెస్టు చేయగా.. ఈ రోజు ఉదయం ఫార్మా సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది.
కాగా, దగ్గుమందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) వెల్లడించిందని.. పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. నిబంధనలను రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ విస్మరించిందని, కేంద్రం చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మీడియా కథనాలు స్పష్టం చేశాయి. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ చేయలేదని పేర్కొంది. సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి ప్రవేశించిందని తెలిపింది. ఫలితంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే పిల్లల మరణాలకు దారితీసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి.


