Team Aid Organisation key Decision: విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు.. ఏదైనా కారణాల వల్ల అక్కడ మరణిస్తే వారి మృతదేహాలను తిరిగి భారత్కు తీసుకురావడానికి చాలా ప్రయాస ఉండేది. ముఖ్యంగా వారి పాస్పోర్టులు అందుబాటులో లేకపోతే ఇండియాకు తరలించడానికి ఎయిర్ లైన్ సంస్థలు అంగీకరించేవి కాదు. ఈ క్రమంలో ఇకపై ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా స్వదేశానికి డెడ్ బాడీలను తరలించేందుకు ‘టీమ్ ఎయిడ్’(Team Aid) సంస్థ చేసిన కృషి ఫలించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/five-infant-deaths-in-on-month-at-alluri-district/
ఇక నుంచి విదేశాల్లో చనిపోయిన భారతీయల మృతదేహాలను వారి పాస్పోర్టు అందుబాటులో లేకున్నా భారత్కు తరలించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చిందని ‘టీమ్ ఎయిడ్’ సంస్థ వ్యవస్థాపకుడు ‘మోహన్ నన్నపనేని’ తెలిపారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘టీమ్ ఎయిడ్ సంస్థ భారత సంతతి ప్రజలకు, ప్రవాస భారతీయులకు అన్ని విషయాల్లో అండగా ఉంటోంది. వారి మృతదేహాలను భారత్కు తరలించడం, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం, అత్యవసర సమయాల్లో భారతీయ కుటుంబాలకు సాయం చేయడం లాంటివి చేస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాయం చేస్తున్నాం. 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ సపోర్ట్తో ఈ-కేర్ పోర్టల్ను ప్రారంభించడంలో సాయం చేశాం. ఇది మానవ అవశేషాలు భారత్కు తరలించేందుకు మార్గం సులభతరం చేసింది. ఇప్పుడు భారతీయుల మృతదేహాలను వారి పాస్పోర్టు అందుబాటులో లేకున్నా కూడా భారత్కు తరలించవచ్చు. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఇంతకుముందు భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు జరిమానా వేస్తారనే భయంతో ఎయిర్లైన్ సంస్థలు మృతదేహాల పాస్పోర్టు లేకుండా వాటిని తరలించేందుకు అంగీకరించేవి కాదు.’ అని మోహన్ నన్నపనేని ప్రకటనలో తెలిపారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను సంబంధింత మంత్రిత్వశాఖల దృష్టికి చేరవేసినట్లు మోహన్ నన్నపనేని తెలిపారు. చీఫ్ అడ్వైజర్, జైపూర్ ఫూట్ యూఎస్ఏ ఛైర్మన్ ప్రేమ్ బండారి, తాను కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది భారతీయ కుటుంబాలకు, ఎయిర్లైన్ సంస్థలకు, కన్సల్టేట్లకు ఎంతగానో ఊరటనిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, భారత ఎంబసీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

