Tejashwi Yadav Promise to give 30k to Woman: బీహార్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బీహార్లో ఎల్లుండి (గురువారం) మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికల సంగ్రామంలోకి దిగాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. మహాగఠ్బంధన్ కూటమి అధికారంలోకి వస్తే ‘మైబహిన్ మాన్ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ రూ.30 వేలు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవల నితీశ్ కుమార్ సర్కార్ నవరాత్రి కానుకగా అక్కడి మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తేజస్వీ యాదవ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గతవారమే మహాగఠ్బంధన్ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని.. రాబోయే ఐదేళ్లు ఒక్కో సంవత్సరానికి రూ.30 వేలు ఇస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదికి గాను మహిళలకు ఒకేసారి రూ.30 వేలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. జనవరి 14న ఈ డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కనీస మద్దతు ధరతో పాటు రైతులకు బోనస్గా క్వింటాల్ వరికి రూ.300, గోధుమలకు రూ.400 చెల్లిస్తామని తెలిపారు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)ను కూడా పునరుద్ధరిస్తామన్నారు. అలాగే పోలీసు, ఆరోగ్య, పాఠశాల లాంటి అన్నిరకాల ప్రభుత్వ సిబ్బందికి వాళ్ల సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సంచలన హామీ ఇచ్చారు. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ప్రతీ మహిళకు రూ.1.50 లక్షలు..
‘ప్రస్తుతం ద్రవ్యోల్బణం మంటలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే మహిళలకు ఏటా రూ.30వేల సాయాన్ని ఇవ్వాలని నిర్ణయించాం. అంటే ఐదేళ్లలో రాష్ట్ర మహిళలకు మా సర్కారు నుంచి రూ.1.50 లక్షలు అందుతాయి. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తుంది. బిహార్లోని సోదరీమణులకు ఇస్తున్న ఈ మాటను నిలబెట్టుకుంటాం. జీవికా దీదీలకు ప్రతినెలా రూ.2వేలను ఇస్తాం. వారికి రూ.5 లక్షల బీమా కవరేజీని కల్పిస్తాం. మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తాం’ అని తేజస్వి వెల్లడించారు.
ప్రతీ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం
విపక్ష మహా కూటమి ‘బిహార్కా తేజస్వి ప్రణ్’ పేరుతో అక్టోబరు 28న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటైన 20 రోజుల్లోగా ఆదేశాలు జారీ చేస్తామని విపక్ష కూటమి హామీ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి రాష్ట్ర మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ లెక్కన ఒక్కో మహిళకు ఏడాదికి రూ.30 వేలు అందనున్నాయి. ఒకేసారి మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తేజస్వి ప్రకటించారు.


