Saturday, November 15, 2025
Homeనేషనల్Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత..విపక్ష పార్టీల ఎంపీలు భారీ ర్యాలీ!

Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత..విపక్ష పార్టీల ఎంపీలు భారీ ర్యాలీ!

Delhi Vs MPs Rally: ఢిల్లీలో ఈ రోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలు తెలియజేయడానికి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే, ఈ ర్యాలీ పార్లమెంట్‌ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వెళ్లేలా అనుమతిని ఢిల్లీ పోలీసులు ఇవ్వలేదు.

- Advertisement -

భద్రత కట్టుదిట్టం..

ఉదయం నుండి పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి, ర్యాలీలో పాల్గొనే ఎంపీలను అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, పోలీసులు అతడిని ఆపడంతో ఆయన రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.

మహిళా ఎంపీలలో కొందరు…

అఖిలేష్‌ యాదవ్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఈ నిరసనలో భాగమయ్యారు. మహిళా ఎంపీలలో కొందరు బారికేడ్లపైకి ఎక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి దించడానికి ప్రయత్నించినా, విపక్ష నేతలు నినాదాలు చేస్తూ కొనసాగారు.

ఎన్నికల సంఘంపై..

ఈ నిరసనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, శశి థరూర్‌ వంటి అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. వారు ప్రభుత్వంపై, అలాగే ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ, బీహార్‌లో కొత్తగా జరిగిన ఓటర్‌ జాబితా సవరణలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

ర్యాలీకి అనుమతి లేదని…

ఈ ర్యాలీకి ముందు, ఎన్నికల సంఘం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌కు లేఖ రాసింది. అందులో, ర్యాలీకి అనుమతి లేదని, అయితే ప్రతినిధి బృందం రూపంలో గరిష్టంగా 30 మంది మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. కానీ, ఇండియా కూటమి నాయకులు సుమారు 300 మంది ఎంపీలతో కలిసి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Also Read: https://teluguprabha.net/national-news/gadkari-counter-trump-tariffs-india-exports/

రాహుల్‌ గాంధీ ఈ నిరసనలో ముందుండి నడిపించారు. ఎన్నికల సంఘం ముందు నిలబడి, గత ఎన్నికల్లో జరిగిన ఓటర్ల జాబితా అక్రమాలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓట్ల చోరీని తాము నిరూపించగలమని సవాల్‌ విసిరారు.

పార్లమెంట్‌ సమీపంలో పోలీసులు విపక్ష నేతల ర్యాలీని అడ్డుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రహదారులపై కూర్చుని నినాదాలు చేయడం, బారికేడ్లపైకి ఎక్కడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విపక్ష నాయకులు, ఈ నిరసన తమ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad