Srinagar: జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో పాల్గొంటున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో అనంతనాగ్లోని లాల్చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందిపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Coronavirus: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. విశాఖలో యువకుడికి కోవిడ్ పాజిటివ్
రంగంలోకి ప్రత్యేక బృందాలు
కాల్పుల అనంతరం ఆయనను వెంటనే అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమై దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో అమర్నాథ్ యాత్ర భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

