Bihar Second phase polling updates: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు ఆయా పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 243 స్థానాలకు గాను తుది దశలో 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. క్యూలో ఉన్న ఓటర్లకు 5 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. రెండో విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,95,44,041 మంది పురుషులు, 1,74,68,572 మంది మహిళలున్నారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహించనున్నట్లుగా ఎన్నికల అధికారి తెలిపారు. తుది దశ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో ఒక ట్రాన్స్ జెండర్ సైతం ఉన్నారు.
ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం: రెండో దశ పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు చేస్తోంది. ఓటర్లు ఈపీఐసీ వెబ్సైట్ లేదా వోటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎన్డీఏ (బీజేపీ, జేడీయూ) మరియు మహాగఠ్బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్) కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో ఆ పార్టీ సైతం .. ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరుగగా.. నేడు రెండో విడత జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.
Also Read:https://teluguprabha.net/national-news/mim-plays-key-role-in-bihar-second-phase-elections/
ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తొలి విడత పోలింగ్లో 65.08% ఓటింగ్ నమోదయింది. ఈ సారి కూడా అదే కంటిన్యూ అవుతుందా ? లేక పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఈ ఉప ఎన్నిక ఫలితం సైతం ఈ నెల 14న వెలువడనుంది.


