Sunday, November 16, 2025
Homeనేషనల్Supreme Court: మత మార్పిడి చట్టాలపై రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court: మత మార్పిడి చట్టాలపై రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు

SC Seeks Reply From States On Anti-conversion Laws: మతాంతర వివాహాల సందర్భంగా బలవంతపు మత మార్పిడులను అరికట్టడానికి కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావై, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. రాష్ట్రాల నుంచి సమాధానాలు అందిన తర్వాతే ఈ చట్టాలపై స్టే ఇవ్వాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. పిటిషనర్లు తమ వాదనలను తర్వాత రెండు వారాల్లో సమర్పించవచ్చని తెలిపింది.
కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో ఈ చట్టాలు ‘మరింత కఠినంగా’ మారాయని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సి.యు. సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మతాంతర వివాహం చేసుకున్న వారికి బెయిల్ లభించడం అసాధ్యంగా మారుతోందని, మూడో పక్షం కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించడం వల్ల తీవ్రమైన వేధింపులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రాజస్థాన్ కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
మరో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, మధ్యప్రదేశ్ చట్టంపై తాత్కాలిక స్టే కొనసాగించాలని కోరగా, ఉత్తర ప్రదేశ్, హర్యానా చట్టాలపై స్టే కోసం తమరు కూడా పిటిషన్లు దాఖలు చేశామని న్యాయవాది వ్రిందా గ్రోవర్ తెలిపారు. అయితే, రాష్ట్రాల తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్, మూడు, నాలుగు ఏళ్ల తర్వాత హఠాత్తుగా స్టే కోసం పిటిషన్లు దాఖలు చేశారని, తాము సమాధానాలు సమర్పిస్తామని తెలిపారు.
బలవంతపు మత మార్పిడులను నిషేధించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు ఈ కేసు నుంచి వేరు చేసింది. మొత్తానికి ఈ చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 25లను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad