TVK Protest Before Lok Bhavan: తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీని ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ తమిళగ వెట్రి కళగం(TVK) కార్యకర్తలు చెన్నైలోని లోక్ భవన్ ముందు ఈరోజు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తమను ఆహ్వానించలేదని పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్కి మద్దతుగా ఆందోళనకి దిగారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/young-man-brutally-murdered-in-chilakalguda/
విజయ్ తన పార్టీకి మద్దతు తెలుపుతున్న 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లేఖను సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు దీనిపై విజయ్ గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. అయితే, మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలని, ఆ సంఖ్యాబలంతో మళ్లీ రావాలని గురువారం విజయ్కి గవర్నర్ సూచించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ సైతం విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై పలువురు సినీ, రాజకీయ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో కానీ.. లోక్భవన్లో కాదని పేర్కొన్నారు. విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని కోరారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ లోక్ భవన్ ముట్టడికి టీవీకే కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అక్కడి నుండి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
మరోవైపు గవర్నర్ తీరుపై టీవీకే చీఫ్ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. వీసీకే, సీపీఐ, సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి నుంచి మద్దతు రాకపోతే అవసరాన్ని బట్టి ఈ రోజు లేదా రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

