Dharmendra Pradhan: సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సరికొత్త పద్ధతి వల్లనే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రంగంలోకి దిగారు.
నైతిక బాధ్యత నాదే!: ఈ వివాదంపై దిల్లీలో సీబీఎస్ఈ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక హామీ ఇచ్చారు. “మూల్యాంకన ప్రక్రియలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే.. అందుకు కారణమైన బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. ఈ లోపాలకు, వైఫల్యాలకు నైతిక బాధ్యత నేనే తీసుకుంటున్నాను. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పులను ఖచ్చితంగా సరిచేస్తాం. తగిన పరిష్కారాలను కనుగొంటాం” అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి జోక్యంతో సీబీఎస్ఈ అధికారులు ఈ లోపాలను సరిదిద్దే పనిలో పడ్డారు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also read-Karnataka: అల్పాహార విందులో ఆసక్తికర ఘటన.. సిద్ధూ కాళ్లు మొక్కిన డీకే!

