Union Minister Piyush Goyal: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు రేపు తేలనుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్లను సోమవారం లెక్కించనున్నారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఈ రోజు ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కంటే తాను ప్రజల నాడిని నమ్ముతానని స్పష్టం చేశారు.
వెస్ట్ బెంగాల్, తమిళనాడులో మార్పు రాబోతోందని.. ప్రజలు సుపరిపాలనను కోరుకుంటున్నారని, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడబోతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. అసోం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు ఖాయమని వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-kkr-beat-sunrisers-hyderabad-by-7-wickets/
‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో అధికారంలోకి రావడం ఖాయం. వివక్ష లేని పాలన, అభివృద్ధిపై దృష్టి సారించే ప్రభుత్వం ఈ రాష్ట్రాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మోదీ చూపిన మార్గంలో నడిచే ప్రభుత్వం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజల రాత మారబోతోంది. ఈ మార్పు ద్వారా సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ముందుకు సాగుతారు. అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది.’ – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

