Vedanta Group Anil Agarwal: భారత్కు చెందిన ప్రముఖ గనుల సంస్థ వేదాంత గ్రూప్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ బుధవారం మృతిచెందారు. ఈ క్రమంలో తన సంపదలో 75శాతం సమాజానికి విరాళంగా ఇవ్వనున్నట్లు అనిల్ అగర్వాల్ ప్రకటింంచారు. కొడుకు మరణించిన రోజు తన జీవితంలో చీకటి రోజుగా పేర్కొంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
సహజ వనరులు, చమురు, జింక్, సీసం, అల్యూమినియం, రాగి, ఇనుప ఖనిజం.. ఇలా దాదాపు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంది వేదాంత గ్రూప్. వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాల్ని విస్తరించారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్(49) గాయపడ్డారు. కొద్దిరోజులుగా న్యూయార్క్లోని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురై జనవరి 7న మరణించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/nirmal-house-lifting-technology-flood-prevention/
కొడుకు మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన అనిల్ అగర్వాల్.. ‘X’ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఓ కీలక ప్రకటన చేశారు. ‘కుమారుడి మరణంతో నా జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. గతంలో అగ్నివేశ్కు మాట ఇచ్చాను. తమ సంపాదనలో 75 శాతానికి మించి సమాజానికి తిరిగి ఇస్తాను.’ అని పోస్ట్ చేశారు. ఈ విషయనాన్ని అనిల్.. గతంలోనే తన కుమారుడికి చెప్పగా.. ఇప్పుడు బహిరంగంగా సోషల్ మీడియా పోస్టులో పునరుద్ఘాటించారు.
’49 ఏళ్ల చిన్న వయసులోనే మా కుమారుడు అగ్నివేశ్ మమ్మల్ని విడిచివెళ్లాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న నా కుమారుడు అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డాడు. ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలోనే కార్డియాక్ అరెస్ట్కు గురయ్యాడు. అగ్నివేశ్ జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. ఒదిగే ఉండే మనస్తత్వం. నా వెంట ఒక స్నేహితుడిలా ఉండే నా కుమారుడు.. దేశం స్వావలంబన దిశగా పయనిస్తుందని బలంగా విశ్వసించేవాడు. మా సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువ సమాజానికే ఇస్తానని నా కుమారుడికి మాట ఇచ్చాను. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాను. నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా ముందుకెళ్లాలో తెలియకపోయినా.. నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.’ అని తన ‘X’ ఖాతాలో అనిల్ వివరించారు.
వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ తల్వండి సాబో పవర్ లిమిటెడ్కు ఛైర్మన్గా అగ్నివేశ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తించారు. 2005-19 మధ్య హిందుస్థాన్ జింక్ ఛైర్మన్గా ఉన్నారు. యూఏఈలో ఫుజైరా గోల్డ్ అనే మెటల్ రిఫైనరీ కంపెనీ స్థాపించారు. కాగా, అనిల్ అగర్వాల్కు అగ్నివేశ్తో పాటు కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె వేదాంత లిమిటెడ్ బోర్డులో సభ్యురాలు కాగా.. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఛైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తన్నారు. అనిల్ అగర్వాల్ నికర సంపద భారత కరెన్సీలో దాదాపు రూ. 35 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

