Saturday, November 15, 2025
Homeనేషనల్Vice Presidential Election: బరిలో రాధాకృష్ణన్.. సుదర్శన్ రెడ్డి.. గెలుపు గుర్రం ఎవరిది?

Vice Presidential Election: బరిలో రాధాకృష్ణన్.. సుదర్శన్ రెడ్డి.. గెలుపు గుర్రం ఎవరిది?

Vice Presidential election contest  : దేశ రెండో అత్యున్నత పీఠమైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల నగారా మోగింది. మంగళవారం జరగనున్న ఈ కీలక ఎన్నికకు పార్లమెంట్ భవనం సర్వం సిద్ధమైంది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవి కోసం, అధికార ఎన్డీఏ కూటమి తరఫున సీనియర్ నేత సి.పి. రాధాకృష్ణన్, విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగు తేజం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా,  సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. సంఖ్యాబలం అధికార పక్షానికి అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ ఎన్నికలో ఏమైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయా..? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి..?

- Advertisement -

ఎన్నికల ప్రక్రియ.. ఎలక్టోరల్ కాలేజీ లెక్కలు : ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నుకుంటారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో మొత్తం 781 మంది ఎంపీలు (లోక్‌సభ 542 + రాజ్యసభ 239) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. గెలుపు కోసం అభ్యర్థికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 391.

ఎన్డీఏ బలం: అధికార ఎన్డీఏ కూటమికి సొంతంగా 425 మంది ఎంపీల బలం ఉంది. దీనికి తోడు, 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో వారి బలం 436కు చేరింది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ. ‘ఇండియా’ కూటమి బలం: విపక్షాల ‘ఇండియా’ కూటమికి సుమారు 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇది గెలుపుకు అవసరమైన సంఖ్య కంటే చాలా తక్కువ.

ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమేనా : పైన పేర్కొన్న గణాంకాలను బట్టి చూస్తే, ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో అధికార పక్షం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడుతోంది. తమ ఎంపీలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేసి ఓటింగ్‌ను ప్రారంభించనున్నారు.

కొన్ని పార్టీలు తటస్థ వైఖరి : ఈ ఎన్నికలో కొన్ని పార్టీలు తటస్థ వైఖరిని ప్రకటించాయి.
ఓటింగ్‌కు దూరం: బీఆర్‌ఎస్ (4 ఎంపీలు), బిజూ జనతాదళ్ (బీజేడీ) (7 ఎంపీలు) ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి.

ఆసక్తి రేపుతున్న ‘ఆప్’: విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు 10 మంది ఎంపీలున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించినా, ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌కు పార్టీతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆమె ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల సభ్యులు ఎవరికి ఓటు వేస్తారనేది కూడా ఫలితాలపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంది.

అభ్యర్థుల విజ్ఞప్తి : “పార్టీలకు అతీతంగా, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి. నా గెలుపు నూటికి నూరు శాతం ఖాయం,” అని విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, “ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు,” అని వ్యాఖ్యానించారు.  సాయంత్రం వెలువడనున్న ఫలితాలతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad