Vijay gives up Trichy East: టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకటి రాజీనామా చేయాల్సి రావడంతో తాను తిరుచ్చి ఈస్ట్ను వదిలి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించారు. ఆదివారం ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓ అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ రెండు సీట్లలో గెలిస్తే ఒక దానికి రాజీనామా చేయాలి. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత తర్వాత ఏకకాలంలో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన నేతగా విజయ్ గుర్తింపు పొందారు.
Also Read: https://teluguprabha.net/national-news/about-the-new-ministers-of-tamilnadu/
రేపే అసెంబ్లీ తొలి సమావేశం .. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో తొలి అసెంబ్లీ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం (మే 11న) ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమం జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారంతా తమ ఎన్నిక సర్టిఫికెట్ను తీసుకురావాలని అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.కె.శ్రీనివాసన్ ఓ ప్రకటనలో కోరారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మే 12న ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ప్రస్తుతానికి తనతో పాటు మరో తొమ్మిది మందిని కేబినెట్లో తీసుకున్న విజయ్.. త్వరలోనే పూర్తి స్థాయి కేబినెట్ను ఏర్పాటు చేయనున్నారు.

