TVK Vijay Public Rally: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట విషాదం తర్వాత.. తొలిసారిగా పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో విజయ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తమిళనాడు సర్కారుపై విమర్శలు గుప్పించారు.
సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉప్పలం గ్రౌండ్స్లో బహిరంగ సభను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. టీవీకే జారీ చేసిన QR కోడ్ పాస్లు కలిగిన 5,000 మందిని మాత్రమే లోపలికి అనుమతి మంజారు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-unveils-telangana-thalli-statues/
ఈ క్రమంలో సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను విజయ్ ప్రశంసించారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం లాంటిది కాదని కామెంట్ చేశారు. సీఎం రంగస్వామి ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అందుకే తమ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి అడగగానే మద్దతిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి వారిని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. అంతేకాకుండా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
‘అసెంబ్లీలో పలుమార్లు తీర్మానాలు చేసినా పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంలో కేంద్రం విఫలమైంది. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఐటీ కంపెనీలను తీసుకురాలేకపోయింది. కారైకాల్ ప్రాంతం అభివృద్ధికి పూర్తిగా దూరమైంది. ప్రజలే వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారు. కాగితంపై తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్నా, మనమంతా ఒకే కుటుంబం. పుదుచ్చేరి రాజకీయాల్లోనూ టీవీకే పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి ప్రజలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నా రాజకీయ ప్రస్థానం తమిళనాడుకే పరిమితం కాదు. పుదుచ్చేరి హక్కుల కోసం కూడా పోరాడతాను.’ అని విజయ్ స్పష్టం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో టీవీకే జెండా ఖచ్చితంగా ఎగురుతుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో స్థానిక సమస్యలపై ఆయన ప్రస్తావించారు. సరైన పార్కింగ్ సౌకర్యాలు, పబ్లిక్ టాయిలెట్లు లేవని ఆరోపించారు. దేశంలో సరైన రేషన్ షాపుల వ్యవస్థ లేని ఏకైక ప్రాంతం పుదుచ్చేరి అని వెల్లడించారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి సమస్యలపై పోరాడతానని విజయ్ హామీ ఇచ్చారు.

