జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై (Pahalgam Terror Attack) కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి గట్టిగా బదులిస్తామని ఉగ్రవాదులను ఉద్దేశించి హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి శ్రీనగర్లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో ఆయన చర్చలు జరిపారు. కాగా ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల వద్ద కొంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.