Women Reservation Bill Loksabha: మహిళా రిజర్వేషన్ల అమలు కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగలింది. ఈ బిల్లు సభలో వీగిపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. అయితే బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ(352) కావాలి. మెజారిటీ ఓటింగ్ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను రేపటికి వాయిదా వేశారు.
మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
కాగా, 2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలును, కొత్త జనాభా లెక్కలతో సంబంధం లేకుండా, ఇప్పుడే నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ సవరణలను ప్రభుత్వం తీసుకురాగా.. ఈ ఓటింగ్ ఓటమితో ఎన్డీఏకి బిగ్ షాక్ తగిలినట్లయింది. దీంతో 2026 ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: https://teluguprabha.net/telangana/ev-charging-points-in-apartments-across-the-state/
రాహుల్ గాంధీ స్పందన
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేసిందంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని చెబుతున్నారు. ఈ బిల్లు వీగిపోవడంపై స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికి మహిళా బిల్లు కాదని.. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే అప్పుడు మద్దతిస్తామని చెప్పారు. డీలిమిటేషన్తో ఈ బిల్లుకి ముడిపెట్టవద్దని పేర్కొన్నారు. పాత జనాభా లెక్కలతో బిల్లు ఆమోదయోగ్యం కాదని ఎంపీ ప్రియాంక గాంధీ వెల్లడించారు.

