Work from home 2 days a week: పొదుపు చర్యల్లో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం పని విధానాన్ని ప్రవేశపెట్టింది. వారంలో 2 రోజులు ఇళ్ల నుంచే పని చేయాలని.. ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని చెబుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గి.. పెట్రోల్, డీజిల్ కొరత నుంచి గట్టెక్కవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలుపై మార్గదర్శకాలు రూపొందిస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.
Also read: https://teluguprabha.net/telangana/high-court-decision-on-bandi-bhagirath-bail-petition/
లాక్డౌన్కు మొదటి అడుగు పడినట్లు నెటిజన్ల కామెంట్..!
కాగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్లో కరోనా తరహా లాక్ డౌన్ పరిస్థితులు రాబోతున్నాయంటూ ప్రధాని మోదీ ఇటీవల అనేక బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. దీంతో, మోదీ నిర్ణయానికి అనుగుణంగా మొట్టమొదటగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అయితే, ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లాక్ డౌన్కు మొదటి అడుగు పడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఆయిల్ సంక్షోభం, ఇంధన కొరత లేదని 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పదే పదే చెబుతున్నప్పటికీ.. ఢిల్లీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం ఎందుకు తీసుకుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది, దేశవ్యాప్తంగా లాక్ డౌన్కు సంకేతమని చెబుతున్నారు. త్వరలోనే కరోనా తరహా లాక్డౌన్ అమల్లోకి రానుందని కొందరు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

