Ahmedabad Plane crash 2025 : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన ఒక మలయాళీ నర్సుపై సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన, కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని, చర్చను రేకెత్తించింది, సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెలవుపై స్వగ్రామానికి వచ్చి…
పతనంతిట్ట జిల్లాలోని పుల్లద్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల రంజిత గోపకుమారన్ నాయర్, గత కొంతకాలంగా యునైటెడ్ కింగ్డమ్లో నర్సుగా పనిచేస్తూ అక్కడే స్థిరపడింది. యునైటెడ్ కింగ్డమ్లో తన భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా నివసిస్తున్న ఆమె, కేరళలో ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగం రావడంతో స్వల్పకాలిక సెలవుపై స్వగ్రామానికి వచ్చింది. సొంత గడ్డపై స్థిరపడాలనే కలలతో యూకేకు తిరిగి బయలుదేరుతుండగా, 2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంలో రంజిత సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం రంజిత కుటుంబాన్ని, కేరళ ప్రజలను తీవ్ర శోకంలో ముంచింది. ఆమె తిరిగి రావాలనే ఆశలు అడియాశలయ్యాయి.
అమానుష వ్యాఖ్యలు, ప్రజాగ్రహం :
రంజిత నాయర్ మృతితో ఆమె కుటుంబం, బంధువులు తీవ్ర విషాదంలో మునిగి ఉండగా, కసర్గోడ్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఎ. పవిత్రన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అసహ్యం కలిగించాయి. తన ఫేస్బుక్లో, “కేరళకు చెందిన ఒక నాయర్ మహిళ చనిపోయింది. ఆమెకు కేరళలో ఉద్యోగం వచ్చినా, సెలవు పెట్టి విదేశాలకు వెళ్లడం వల్ల ఇంకొకరికి అవకాశం పోయింది. నాకు ఏమీ అనిపించడం లేదు. అందరికీ సంతాపం” అంటూ కుల వివక్ష, అహంకారంతో పోస్ట్ చేశాడు. అవమానిం బాధితుల పట్ల కనీస సానుభూతి లేకుండా, మానవత్వాన్ని మంటగలిపేలా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. పవిత్రన్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.