AHMEDABAD PLANE CRASH 2025 : అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ (AI171) విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం కేవలం ప్రాణ నష్టాన్ని మాత్రమే కాకుండా, ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక భారాన్ని మోపనుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ప్రతీ మరణించిన ప్రయాణీకుడికి భారీ పరిహారం చెల్లించాల్సి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన ఎయిర్ ఇండియా భవిష్యత్తును అగమ్యగోచరంగా మారనుందా..? ఈ పెను విషాదం దాని ఆర్థిక భవిష్యత్తుపై ఎలాంటి పెను సవాళ్లను విసురుతోంది? పూర్తి కథనం మీ కోసం.
అంతర్జాతీయ నిబంధనలు కోట్లలో పరిహారం:
ప్రమాదంలో మరణించిన ప్రతీ ప్రయాణీకుడికి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కన్వెన్షన్ ప్రకారం, మరణించిన ప్రతీ ప్రయాణీకుడికి 151,880 SDR (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) చెల్లించాలి. ఒక SDR విలువ ప్రస్తుతం సుమారు రూ.120. అంటే, ప్రతీ ప్రయాణీకుడికి దాదాపు రూ 1.8 కోట్లు చెల్లించాలన్నమాట. ఈ పరిహారం, ప్రమాదానికి ఎవరు కారణం అన్నదానితో సంబంధం లేకుండా, మరణించినవారి కుటుంబాలకు అందజేయాలి. టాటా గ్రూప్ ఇప్పటికే ప్రతీ ప్రయాణీకుడికి రూ. 1 కోటి పరిహారం ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రూ.1.8 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
SDR అంటే ఏమిటి? ఎందుకు అంత ముఖ్యం?
SDR ఒక కరెన్సీ కాదు, IMF ఉపయోగించే యూనిట్ ఆఫ్ అకౌంట్.దీని విలువ జపాన్ యెన్, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ అనే ఐదు అంతర్జాతీయ కరెన్సీల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రపంచవ్యాప్త ప్రమాదాల్లో పరిహారం పారదర్శకంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. దేశీయ కరెన్సీల ప్రభావం లేకుండా నష్టపరిహారం చెల్లించడానికి ఉపయోగపడుతుంది.
మొత్తం పరిహారం రూ.400 కోట్లు దాటే అవకాశం:
మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం, ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు రూ.377 కోట్ల పరిహారం చెల్లించాలి. సిబ్బందికి ఈ కన్వెన్షన్ వర్తించదు. ఒకవేళ వారికి కూడా చెల్లించాల్సి వస్తే ఈ మొత్తం రూ.412 కోట్లు దాటుతుంది. సాధారణంగా వారికి కార్మిక చట్టాలు లేదా బీమా ద్వారా పరిహారం లభిస్తుంది.
నిర్లక్ష్యం నిరూపితమైతే, భారీ పరిహారం:
ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం రుజువైతే, మరణించినవారి కుటుంబాలకు SDR పరిమితికి మించి భారీ పరిహారం దక్కవచ్చు. మృతుల వయస్సు, ఆదాయం, పోషణలో ఉన్నవారి సంఖ్య వంటివి పరిగణించి కోర్టులు అదనపు పరిహారం ఇస్తాయి.ఈ అధిక పరిహారం కోసం ఎయిర్ ఇండియా తప్పును కోర్టులో నిరూపించాలి. ఇది స్థిర పరిహారానికి అదనంగా లభించే అవకాశం
రూ. 18 లక్షల ముందస్తు చెల్లింపు :
మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం, ఎయిర్ ఇండియా బాధితుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా ముందస్తు చెల్లింపులు చేయాలి.ఈ చెల్లింపులు అంత్యక్రియలు, తాత్కాలిక నివాస ఖర్చుల కోసం ప్రతీ ప్రయాణీకుడికి కనీసం 16,000 SDRలు (సుమారు రూ.18 లక్షలు) ఉండాలి.
డ్రీమ్లైనర్ నష్టం: రూ 1,400 కోట్ల పైనే :
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ఇటీవల జరిగిన ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. ఈ విమానం విలువ సుమారు రూ. 1,040 కోట్ల నుంచి రూ.1,450 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదం ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది, ఎందుకంటే డ్రీమ్లైనర్లు వారి అంతర్జాతీయ కార్యకలాపాలకు కీలకమైనవి.
అదనపు నష్టాలు, పెరగనున్న కష్టాలు :
ఈ ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియాకు దాదాపు రూ.11,212.5 కోట్ల (సుమారు $130 మిలియన్లు) నష్టం వాటిల్లిందని అంచనా.ఈ మొత్తం నష్టంలో, విమానానికి సంబంధించిన విలువ రూ.6,900 కోట్లు (సుమారు $80 మిలియన్లు) కాగా, ఇతర బాధ్యతలు, అనగా థర్డ్-పార్టీ నష్టాలు, మరణాలు లేదా గాయాలకు సంబంధించినవి రూ.4,312.5 కోట్లు (సుమారు $50 మిలియన్లు)గా ఉన్నాయి.
దేశీయ చట్టాల ప్రకారం :
విమానం మెడికల్ కాలేజీ క్యాంపస్లో కూలడంతో నేలపై కూడా ప్రాణనష్టం సంభవించింది. మాంట్రియల్ కన్వెన్షన్ ఈ నేలపైన జరిగిన నష్టాలను కవర్ చేయదు, కాబట్టి దేశీయ చట్టాల ప్రకారం బాధ్యత నిర్ణయించబడుతుంది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. వేలాది కోట్ల రూపాయల నష్టపరిహారం, విమానం కోల్పోవడం వంటివి సంస్థ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Air India suffers huge losses : ఎయిర్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES