Delhi: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల మహోత్సవాలు మంగళవారం రెండో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్రెడ్డి, శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధానిలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా పరిచయమవుతోందన్నారు. బోనాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎ.పీ. జితేందర్రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ ఉత్సవాలు తమ మాతృభూమితో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

