Thursday, September 19, 2024
HomeNewsChandrayan: ఉత్కృష్టమైన చంద్రయాన్‌-3 ప్రయోగంలో భారత 'రాకెట్‌ మహిళ' పాత్ర

Chandrayan: ఉత్కృష్టమైన చంద్రయాన్‌-3 ప్రయోగంలో భారత ‘రాకెట్‌ మహిళ’ పాత్ర

చంద్రయాన్‌-3 మిషన్‌లో 54 మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రధాన పాత్ర పోషించారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధృవంపై దిగుతూ ల్యాండర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో నాటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు లోపాలను సవరించుకుని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్‌-3ను బాహుబలి రాకెట్‌ ఎల్‌ఎంవీ-ఎం4 ద్వారా 14 జూలై 2023 న తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుండి నింగిలోకి పంపారు. ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, భారీ ప్రయోగం ఇది. ఈ మిషన్‌ కోసం 17 వేల మందికిపైగా సిబ్బంది శ్రమించగా మొత్తం రూ.613 కోట్లను వెచ్చించారు. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశాయి. చంద్రయాన్‌-3 దక్షిణ ధృవం వద్ద దిగి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది. అంతేకాదు, చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది. ప్రత్యేకించి చంద్రయాన్‌-3 మిషన్‌లో దాదాపు 54 మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రధాన పాత్ర పోషించడం విశేషం. కాగా ఈ ప్రయోగం తర్వాత, అనూహ్యంగా డాక్టర్‌ రీతూ కరిధాల్‌ శ్రీవాస్తవ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మంగళయాన్‌) మరియు ఇతర అంతరిక్ష యాత్రలలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత రాకెట్‌ మహిళ‘గా పేరు గడించి ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్తలలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా రీతూ కరిధాల్‌ శ్రీవాస్తవ ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగం కోసం రీతూ కరిధాల్‌ ప్రదర్శిస్తున్న అసాధారణ స్ఫూర్తి, అందిస్తున్న సహాయ సహకారాల మరియు కృషితో ఆమె అత్యంత ప్రేరణాత్మకంగా మరియు మార్గదర్శకురాలిగా ప్రకాశిస్తున్నారు. శాస్త్రవేత్తగా ఆమె ప్రదర్శిస్తున్న అద్వితీయమైన ప్రతిభ మరియు కఠోర పరిశ్రమ, చంద్రయాన్‌-2 వంటి ప్రముఖ మిషన్లలో ఆమె నిర్వహించిన పాత్ర దేశ అంతరిక్ష పరిశోధనా ప్రయత్నాలలో ఆమెను ముందంజలో ఉంచింది.
బాల్యం నుండే అంతరిక్షంపై మక్కువ:
అంతరిక్ష సంబంధిత విషయాలపై రీతూ కరిధాల్‌ శ్రీవాస్తవకు బాల్యంలోనే మక్కువ ఏర్పడడం ప్రారంభమై ఆ జిజ్ఞాస వయసుతో పాటు పెరుగుతూ ఆమెను శాస్త్రీయ పరిశోధనల వైపు నడిపించింది. చిన్న నాటి నుండే ఆమె మేడపై గంటల తరబడి ఆకాశంలోని చంద్రున్ని మరియు నక్షత్రాలను గమనిస్తూ, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ కాలం గడిపేది. గణితం పై తనకు గల మక్కువ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఒక ఇంటర్వ్యూ లో గణితం పై పద్యాలు రాయడంతో పాటు సంఖ్యలు నన్ను చుట్టుముట్టినట్లు ఊహించుకునేదాన్ని అన్నారు. తన యుక్తవయసులో ఆమె వివిధ దినపత్రికలలో ప్రచురితమయ్యే నాసా మరియు ఇస్రో ల కార్యక్రమ వివరాలను ఎంతో ఆసక్తిగా చదువుతూ ఆయా వార్తా పత్రికలను జాగ్రత్తగా భద్రపర్చుకుంటూ అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రగాఢంగా కోరుకునేది. అంతరిక్షంపై ఉన్న అచంచలమైన అభిరుచి, అనురక్తి మరియు సైన్స్‌లో వృత్తిని కొనసాగించాలనే ఆమె సంకల్పం, ఆమెను ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందేలా చేసింది. ఆమెలోని ఈ ఉత్సుకత మరియు ఖగోల శాస్త్ర రహస్యాలను ఛేదించాలనే సహజమైన కోరిక ఈ అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకడంతో పాటు భారతదేశ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఆమెను ఒక విశిష్ట వ్యక్తిగా ముందు వరుసలో నిలబెట్టడానికి దోహదమవుతున్నాయి. 13 ఏప్రిల్‌ 1975 న ఉత్తర ప్రదేశ్‌ లోని లక్నోలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన డా రీతూ కరిధాల్‌ ప్రాథమిక విద్యాభ్యాసం లక్నోలోని సెయింట్‌ అంజని పబ్లిక్‌ స్కూల్‌, నవయుగ కన్య విద్యాలయ మరియు ఉన్నత విద్య మహిళా విద్యాలయ పీజీ కళాశాల, లక్నో యూనివర్సిటీ మరియు ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు లో కొనసాగింది. 1997 లో ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఆరు నెలలు పీ హెచ్‌ డీ కొనసాగించి ఆ తరువాత గేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పీ హెచ్‌ డీ అర్థాంతరంగా నిలిపి వేసి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు లో చేరి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లో ఎం టెక్‌ పూర్తిచేసారు.

- Advertisement -


ఇస్రోలో డా రీతూ కరిధాల్‌ ప్రయాణం:
1997లో ఇస్రోలో చేరిన తర్వాత ఆమె కొన్ని ముఖ్యమైన మిషన్లలో చురుకుగా పాల్గొన్నారు. 2013లో, ఆమె మంగళయాన్‌ మిషన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా అలాగే చంద్రయాన్‌-2కి మిషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె యొక్క 20 పైగా పరిశోధనా పత్రాలు ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆమె విద్యార్హతలు మరియు ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో పనితీరును పరిగణనలోకి తీసుకున్న ఇస్రో ఆమెకు యు ఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ లో కఠినమైన బాధ్యతలు అప్పగించడమే కాక సీనియర్‌ శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ ఆమెకు అధునాతనమైన ప్రాజెక్టులలో అవకాశాలు కల్పించింది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పింది. మంగళయాన్‌ మిషన్‌ లో అంతరిక్ష వాహక నౌక యొక్క స్వయంప్రతిపత్తి వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉపగ్రహం లోని భాగాలు సమయానుసారం విడివడేలా చూడడం, ఒక వేళ సాంకేతిక కారణాలతో ప్రతిష్టంభన ఏర్పడితే ఆ లోపాన్ని వ్యవస్థ ద్వారానే స్వయంగా సరిదిద్దికుని పునరుద్ధరింపబడేలా సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని జోడించే బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశ చారిత్రాత్మక చంద్రయాన్‌-2 మిషన్‌కు మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్‌ రీతూ కరిధాల్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె జిశాట్‌-6ఏ మరియు జిశాట్‌-7ఏ మిషన్‌ లలో కూడా పనిచేసారు. ఆమె అసాధారణమైన నాయకత్వ లక్షణాలు మరియు సాంకేతిక నైపుణ్యం మిషన్‌ ప్రయోగంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాయి. మిషన్‌ ప్లానింగ్‌ నుండి అంతరిక్షవాహక నౌక నావిగేషన్‌ వరకు ఆమె మార్గనిర్దేశం చేసారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి చంద్రయాన్‌-2ను ఒక ముఖ్యమైన మైలురాయిగా మార్చడంలో డాక్టర్‌ రీతూ కరిధాల్‌ యొక్క అచంచలమైన సంకల్పం మరియు చిత్తశుద్ధి ప్రధాన భూమిక నిర్వహించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్‌-2 మిషన్‌ సందర్భంగా ఆమె ప్రదర్శించిన సునిశిత దృష్టి మరియు త్రికరణ శుద్ధి ఇప్పుడు చంద్రయాన్‌-3 మిషన్‌లో ఆమెను ప్రముఖ శాస్త్రవేత్తగా ముందు వరుసలో ఉండేలా చేసింది. అంతరిక్ష వాహక నౌక నావిగేషన్‌, మిషన్‌ విశ్లేషణ మరియు వ్యవస్థ అనుసంధానం లాంటి అంశాలలో ఆమె నైపుణ్యం మరియు ప్రతిభాపాటవాలు మిషన్‌ విజయంలో ఆమెను ఒక అమూల్యమైన ఆస్తిగా నిలిపింది. ప్రముఖ శాస్త్రవేత్తగా, మిషన్‌ యొక్క పథం, అంతరిక్ష నౌక రూపకల్పన మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్‌-3 కోసం ఆమె చేసిన విశిష్ట కృషి అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్రగామి మహిళగా ఆమె వారసత్వాన్ని మరింత సుస్థిరం చేశాయి.


భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం:
గొప్ప సాంకేతిక నైపుణ్యం, అద్వితీయమైన పనితీరు, అచంచలమైన ఆత్మవిశ్వాసం మరియు వృత్తి పట్ల అంకిత భావాలతో డాక్టర్‌ కరిధాల్‌ శ్రీవాస్తవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా మరియు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతరిక్షం పట్ల ఆమెకున్న అభిరుచి, నాయకత్వ లక్షణాలు మరియు సాంకేతిక నైపుణ్యం ఈ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఆమె విజయాలు లింగ వివక్షతను అధిగ మించి, శాస్త్రసాంకేతిక రంగంలో మహిళల అద్భుతమైన సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో తన అద్భుతమైన ప్రయాణం ద్వారా, మూస పద్ధతులను బద్దలు కొట్టిన ఆమె మహిళలకు భవిష్యత్తుపై ఆశావహ దృక్పధాన్ని మరియు ప్రేరణను కలిగిస్తుంది. మహిళా సాధికారతకు సామాజిక నిబంధనలు లేదా కట్టుబాట్లు ఏమాత్రం అవరోధాలు కాజాలవని ఆమె తన విజయాల ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపిస్తూ నేటి యువతరానికి ప్రత్యేకించి మహిళలకు స్ఫూర్తిప్రధాతగా నిలుస్తున్నారు.


పురస్కారాలు:
డా రీతూ కరిధాల్‌ 2007 లో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏ పి జె అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా యువ శాత్రవేత్త పురస్కారం, 2015 లో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ కోసం ఇస్రో టీం పురస్కారం, ఏఎస్‌ఐ టీం పురస్కారం, 2017 లో సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ ద్వారా అంతరిక్ష రంగంలో విజయం సాధించిన మహిళా పురస్కారం, లక్నో యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.
మార్చ్‌ 3, 2019న హైదరాబాద్‌లో నిర్వహించబడిన టీఈడీఎక్స్‌ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న ఆమె మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ లో తన అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ ప్రయోగానికి పది నెలల ముందు నుండే తాను తీవ్ర వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వత్తిడికి గురైనప్పటికీ అది తనకు సంతృప్తి కలిగించిందన్నారు. ఆఫీసు నుండి తిరిగివచ్చిన వెంటనే వాయువేగంతో ఇంటిపనులు ముగించుకుని పిల్లల హోంవర్క్‌ పూర్తిచేయిం చి అర్థరాత్రి ప్రారంభించి తెల్లవారు ఝామున దాదాపు నాలుగు గంటల వరకు తన పనిలో నిమగ్నమయ్యేదాన్నని తెలిపారు. అంతరిక్ష విజ్ఞాన రంగంలో మరింత మంది మహిళలు తమ నైపుణ్యాన్ని మరియు సత్తాను చాటుకొని ఆకాశమే హద్దుగా కొనసాగి అంతరిక్ష రంగంలో నోబెల్‌ బహుమతులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలీవు్‌డ నటుడు షారుఖ్‌ ఖాన్‌ మాట్లాడుతూ భారత రాకెట్‌ మహిళ డా రీతూ కరిధాల్‌ తో భేటీ కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొనడం విశేషం.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ
-8885050822.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News