Monday, June 16, 2025
HomeNewsCongress On PM Modi Foreign Tour : నాలుగో E ఎక్కడ?

Congress On PM Modi Foreign Tour : నాలుగో E ఎక్కడ?

Congress Quetioned PM Modi : ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైప్రస్, కెనడా, క్రొయేషియా పర్యటనకు బయల్దేరిన మోదీకి ‘ఎనర్జీ, ఎగ్జైట్‌మెంట్, ఎంథూజియాజం’ అనే మూడు ‘ఈ’లు ఉన్నాయని, కానీ నిత్యం అల్లర్లతో తల్లడిల్లుతున్న మణిపూర్‌కు వెళ్లేందుకు ‘ఎంపథీ’ (సానుభూతి) అనే నాలుగో ‘ఈ’ లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మణిపూర్‌లో నెలల తరబడి హింస జరుగుతున్నా, ప్రధాని ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

ప్రధాని మోదీకి మణిపూర్ పట్టదా?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. 2023 మే నెల నుంచి ప్రధాని 35 సార్లు విదేశాలకు వెళ్లినా, అల్లర్లతో అల్లాడుతున్న మణిపూర్‌కు మాత్రం ఒక్కసారి కూడా వెళ్లకపోవడం దారుణమని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శించింది.

నాలుగో ‘ఈ’ (ఎంపథీ) లేదా?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ప్రధానికి విదేశీ పర్యటనలకు వెళ్లడానికి కావాల్సినంత శక్తి (ఎనర్జీ), ఉత్సాహం (ఎంథూజియాజం), ఉత్సుకత (ఎగ్జైట్‌మెంట్) ఉన్నాయని, కానీ మణిపూర్ ప్రజల పట్ల మాత్రం సానుభూతి (ఎంపథీ) అనే నాలుగో ‘ఈ’ పూర్తిగా కొరవడిందని ఆరోపించారు. సాధారణంగా, ఎవరైనా కష్టాల్లో ఉన్న ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రధాని మోదీకి ఆ ప్రయత్నం కూడా లేదని జైరాం రమేశ్ దుయ్యబట్టారు.

మణిపూర్‌ను ఘోరంగా విస్మరిస్తున్నారు:
2023 మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో హింస చెలరేగుతున్నా, ప్రధాని ఆ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా విస్మరిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ సుదీర్ఘ కాలంలో మణిపూర్‌కు చెందిన ఏ ఒక్క ప్రతినిధిని కూడా ప్రధాని మోదీ కలవలేదని, వారి కష్ట నష్టాలను వినడానికి ఆసక్తి చూపట్లేదని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రధాని ఈ విదేశీ పర్యటనలకు చూపిస్తున్నంత శ్రద్ధ, ఉత్సాహం దేశంలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మణిపూర్ వంటి కీలక రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి చూపడం లేదని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆక్షేపిస్తోంది. ఇది ప్రధానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతారాహిత్యాన్ని, ప్రశ్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.

కెనడా, భారత్ బంధంపై మోదీ అంచనాలు తలకిందులయ్యాయి: కాంగ్రెస్ విమర్శ
2015లో ప్రధాని మోదీ కెనడా, భారత్ బంధం (a+b)^2 సూత్రంలా ఎల్లప్పుడూ కలిసి ఉంటుందని చెప్పారు. అయితే, ఆయన అంచనా అక్షరాలా తప్పని కాలక్రమంలో తేలిపోయింది, ప్రస్తుత దెబ్బతిన్న సంబంధాలే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, 2015లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను రమేశ్ తన ట్వీట్‌లో పంచుకున్నారు.

మోదీ ‘నిజస్వరూపం’ బయటపడింది: కెనడా పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు
కెనడా ప్రధాని భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొనగా, నీతి ఆయోగ్ సీఈఓ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు; ఈ వ్యత్యాసాన్ని మోదీ గుర్తించాలని కాంగ్రెస్ విమర్శించింది. కెనడా ఆహ్వానించినా మోదీ జీ7 సదస్సుకు వెళ్లరని ఆయన అభిమానులు చేసిన ప్రతిజ్ఞలను మోదీ వమ్ము చేస్తూ సదస్సుకు హాజరయ్యారని, దీంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని జైరాం రమేశ్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News