Israel Running Low On Air Defence : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇరుదేశాలు ప్రతిరోజూ పరస్పరం రాకెట్ దాడులకు పాల్పడుతుండగా, ఇజ్రాయెల్పై భయంకరమైన ఒత్తిడి నెలకొంది. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు కేవలం 10-12 రోజులకు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.
బలహీనపడుతున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించామని చెబుతున్నప్పటికీ, ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్ క్షిపణులు ఐరన్ డోమ్ను ఛేదించి విధ్వంసం సృష్టిస్తున్నాయి, వాటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే, ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు త్వరలో అడుగంటిపోతాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా సహాయం లేకపోతే, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 10-12 రోజుల్లోనే బలహీనపడవచ్చని అవి పేర్కొన్నాయి.
భారీగా పెరిగిపోతున్న ఖర్చులు: ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తోంది. వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఒక్క రాత్రికి $285 మిలియన్లు (దాదాపు రూ. 2,400 కోట్లు) ఖర్చు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన 400 బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ యారో సిస్టమ్, డేవిడ్స్ స్లింగ్, అమెరికా అందించిన పాట్రియాట్స్, థాడ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఈ వ్యవస్థల నిర్వహణ వ్యయం ఇజ్రాయెల్కు భారంగా మారింది. ఒక్క యారో సిస్టమ్ ద్వారానే $3 మిలియన్ల విలువైన ఇంటర్సెప్టర్లను ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్నట్లు మార్కర్ పత్రిక తెలిపింది.
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : ఈ అధిక వ్యయం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు ఇరాన్ క్షిపణి లాంచర్లలో మూడింట ఒక వంతు మాత్రమే ధ్వంసం చేశాయని ప్రకటించాయి. కానీ సగానికి పైగా క్షిపణులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇవి భూగర్భంలో దాచే అవకాశముండటంతో, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు ఇది తీవ్రమైన సవాలుగా మారే అవకాశం ఉంది.