Wednesday, September 25, 2024
HomeNewsJadcharla: ప్రాజెక్టులు అత్యంత వేగంగా పూర్తి చేయటమే మా లక్ష్యం

Jadcharla: ప్రాజెక్టులు అత్యంత వేగంగా పూర్తి చేయటమే మా లక్ష్యం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని, దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షల నిమిత్తం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను తనిఖీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్ కు 45 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ల తో పాటు, కోయిల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు- రంగారెడ్డి పై 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఎకరాకు సైతం నీళ్లు ఇవ్వలేదని అన్నారు. పైగా పాలమూరు- రంగారెడ్డికి నీటి వాటాను సైతం సాధించ లేకపోయారని తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, ఇదే చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను సైతం నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని, ఇందుకుగాను ఒక సమయాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ఉదండాపూర్ తో పాటు, ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన వారికి న్యాయపరంగా పునరావాసం అందిస్తామని, వీటన్నిటిపై సమీక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వాయర్ కింద ఆర్అండ్ఆర్ కు 45 కోట్ల రూపాయలు విడుదల చేయటం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఆర్అండ్ఆర్ లో భూ సేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మూడు కోట్ల 74 లక్షలు, అలాగే ఆర్అండ్ఆర్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న 2.6 కోట్ల రూపాయలు ఉదండాపూర్ లోని నిర్మాణాలకు 13 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని వాటిని చెల్లించాలని, అలాగే అ వార్డులకు సంబంధించి అదనంగా అవసరమైన బడ్జెట్ ను కేటాయించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం పూర్తిగా రైతు ప్రభుత్వం అని, అందుకే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని నాలుగు తండాల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ఆయన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని, ప్రత్యేకించి ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్లు పూర్తయితే కరివేన ద్వారా 2.5 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ ద్వారా 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించ వచ్చని, నూటికి నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే పునరావాసం సైతం పూర్తిచేయాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ -ఇన్- చీఫ్ అనిల్ కుమార్, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధు సూదన్ రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి, షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ జానకి, ఎస్ ఈ శ్రీనివాసరావు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎస్ మోహన్ రావు, మహబూబ్ నగర్ ఆర్డిఓ నవీన్, మైనర్ ఇరిగేషన్ జిల్లా ఎస్ ఈ చక్రధరం, పాలమూరు- రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News