తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ రాజకీయ వేడి చల్లబడకముందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 31న బంజారాహిల్స్లోని ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మీద ఎలాంటి ఆరోపణలు సహించబోమని, ఆయనకు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్ల లాంటివని స్పష్టంచేశారు.
“కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే, తెలంగాణ అంతటికీ అవమానం చేయడమే నన్నారు. ఇది కేవలం కాళేశ్వరం కేసు కాదు… ఇది కాంగ్రెస్ కుట్ర,” అని ధ్వజమెత్తిన కవిత, జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. జై తెలంగాణ, జై జాగృతి అనే నినాదాలతో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి 18 ఏళ్లుగా రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని, జయశంకర్ గారి మార్గనిర్దేశంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిందని గుర్తు చేశారు. తాము ఉద్యమానికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వాలు స్పందించేవి. ఇది జాగృతికి ఉన్న ప్రాభవం.. అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ… సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న అయినా అమరవీరులకు నివాళి అర్పించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినవారిని గౌరవించాలన్నారు. యువ వికాసానికి రాజీవ్ పేరు ఎందుకు అని ప్రశ్నించారు ఇది తెలంగాణ యువత పోరాటం. అది గుర్తుంచుకోవాలన్నారు.
అలాగే నీటి వివాదాలపై ప్రభుత్వ నిశ్చలతను ఎత్తిచూపుతూ… ఏపీ గోదావరి నీటిని తరలించుకుంటూ పోతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బనకచర్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని.. గోదావరి నీరు శాశ్వతంగా కోల్పోతే తీవ్ర పరిణామాలు వస్తాయని హెచ్చరించారు.
బీసీలకు రిజర్వేషన్లు అనుసంధానంగా మాట్లాడిన కవిత, స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకపోతే… రైల్ రోకో లాంటి ఉగ్ర ఉద్యమాలు తప్ప అంటూ గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద, జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం కంటే కవిత వ్యాఖ్యలే ఈ రోజు రాజకీయ వేడిని మరింత పెంచాయి.