Microsoft Meltdown:టెక్ ప్రపంచంలో పెను సంచలనం చోటుచేసుకుంది. అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో కళ్లు చెదిరే రీతిలో కుప్పకూలింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సంస్థ షేరు విలువ 12 శాతం పతనం కావడంతో, ఏకంగా 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 36 లక్షల కోట్లు) మదుపర్ల సంపద గాలిలో కలిసిపోయింది. మార్కెట్ చరిత్రలో ఒకే రోజులో సంభవించిన రెండో అతిపెద్ద పతనం ఇది.
పతనానికి అసలు కారణాలేంటి?
2020 కరోనా సంక్షోభం తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో కుంగిపోవడం ఇదే తొలిసారి. 1986లో ఐపీఓకు వచ్చిన నాటి నుండి లెక్కవేస్తే, ఇది సంస్థ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏఐ పెట్టుబడులపై ఆందోళన: కృత్రిమ మేధ (AI) కోసం మైక్రోసాఫ్ట్ చేస్తున్న ఖర్చులు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. గతేడాది ఏఐ, క్లౌడ్ విభాగాలపై పెట్టుబడులు 66 శాతం పెరిగినా, ఆశించిన స్థాయిలో ప్రతిఫలాలు రాకపోవడం మదుపర్లను నిరాశకు గురిచేసింది.
Also Read: Kevin Warsh Fed Chair – ఫెడ్ చీఫ్గా కెవిన్ వార్ష్ నామినేషన్
పెట్టుబడి Vs ప్రతిఫలం:
అజ్యూర్ (Azure) వృద్ధి మందగమనంలోని వెల్లింది.దీంతో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ‘అజూర్’ వృద్ధి రేటు గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. భారీగా నిధులు కుమ్మరిస్తున్నా, ఆదాయం ఎప్పుడు వస్తుందనే ప్రశ్న ఇన్వెస్టర్ల నుంచి వస్తోంది.
అప్పుల బాటలో టెక్ దిగ్గజాలు
రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల నిర్మాణం కోసం మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారీగా అప్పులు చేయాలని నిర్ణయించుకున్నాయి. రానున్న ఏళ్లలో ఏఐ అభివృద్ధికి 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఓపెన్ ఏఐ వెల్లడించింది. లాభాలు రావడానికి 2030 వరకు వేచి చూడాలని ఆ సంస్థ పేర్కొనడం ఇన్వెస్టర్లలో సహనాన్ని పరీక్షిస్తోంది.
చైనా ‘డీప్సీక్’ ఎఫెక్ట్
గతంలో చైనాకు చెందిన డీప్సీక్ (DeepSeek) అనే ఏఐ మోడల్ రాకతో చిప్ దిగ్గజం ‘ఎన్విడియా’ ఏకంగా 593 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వంతు వచ్చింది. టెక్ రంగంలో ‘ఏఐ బబుల్’ (AI Bubble) పేలిపోతుందా? అనే అనుమానాలు ఇప్పుడు ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల హోరు పెరుగుతున్నా, రాబడి రాకపోవడంతో టెక్ మార్కెట్ ప్రస్తుతం ఒక అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

