UN Session : పాకిస్థాన్ ‘ఆపరేషన్ సిందూర్’ను తప్పుదోవ పట్టించేందుకు చేసిన యత్నాలను భారత్ ఐక్యరాజ్యసమితిలో తీవ్రంగా ఖండించింది. స్విట్జర్లాండ్ జెనీవాలో బుధవారం జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో, భారత్ తరఫున మాట్లాడిన శాశ్వత మిషన్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి, ఉగ్రవాదుల్ని పెంచిపోషించే దేశం పాకిస్థాన్, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ను తప్పుగా చూపిస్తూ ప్రపంచ సానుభూతి కోరుకుంటుందంటూ విమర్శించారు. భారత్ తీసుకున్న చర్యలు ఎటువంటి ఉల్లంఘనలూ కాదని, దేశ పౌరుల్ని, భద్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వం బాధ్యతని తేల్చారు. పాకిస్థాన్ రెచ్చగొట్టే కుట్రలకు భయపడేది లేదని, భారత్ తన చర్యల్ని ఇకపై కూడా కొనసాగిస్తుందని త్యాగి స్పష్టం చేశారు.
ఉగ్రవాదానికి పాలకుడిగా పాకిస్థాన్, బాధితుడిగా నటించడం విడ్డూరం : “పాకిస్థాన్ తన దేశంలో ఉన్న ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, మానవ హక్కుల పేరుతో మాయాజాలం సృష్టిస్తోందని క్షితిజ్ త్యాగి ధ్వజమెత్తారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది భారతీయ పర్యాటకులను ఉగ్రవాదులు కుటుంబాల ఎదుటే చంపారు. ఆ దాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించింది.” అని సభకు క్షితిజ్ త్యాగి తెలియజేశారు.
ఒసామా బిన్ లాడెన్కి అతిథి సేవ చేసిన పాక్ : “పాక్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారింది. ఓవైపు ఒసామా బిన్ లాడెన్కు సైనిక ప్రాంతంలో ఆశ్రయం, మరోవైపు అంతర్జాతీయ ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు పాకిస్థాన్నే బాధితుడిగా నటిస్తోందని” త్యాగి పాకిస్థాన్ ని దుయ్యబట్టారు.
సింధూ ఒప్పందాన్ని తానే ఉల్లంఘించిన పాక్ : “1960లో కుదిరిన సింధూ జల ఒప్పందాన్ని భారత్ పటిష్టంగా పాటించింది. కానీ పాక్ మాత్రం దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంటోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ముఖ్యంగా సింధూ జలాల ఒప్పంద అమలు” అని త్యాగి వివరించారు.
ఆపరేషన్ సిందూర్ : మే 7న, పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది.ఈ ఆపరేషన్లో కీలక ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేశారు. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగినా, మే 10న భారత్–పాక్ డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణపై అంగీకారం ఏర్పడిన విషయం విధితమే.