ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా గుడ్డిగా వ్యతిరేకించడం..జాతీయ, సాంస్కృతిక సమైక్యతను సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. జనసేన ఆవిర్భావ సభలో బహుభాష విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో వివాదాస్పదం కావడంతో ఎక్స్ వేదికగా స్పందించారు.
“నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. జాతీయ విద్యా విధానం(NEP) 2020 స్వయంగా హిందీని అమలు చేయనప్పుడు, బలవంతంగా రుద్దుతున్నారంటూ అసత్య కథనాలు వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్ఈపీ 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉంటారు.
హిందీ నేర్చుకోవడానికి ఇష్టం లేనివారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలీ, ఉర్దూ లేదా ఇతర భారతీయ భాషలను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే శక్తిని ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడింది. ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవడం నేను నా వైఖరిని మార్చుకున్నారని చెప్పడం అవగాహనా లోపాన్ని ప్రతిబింబిస్తుంది. జనసేన పార్టీ ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి దృఢంగా కట్టుబడి ఉంది” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.