Wednesday, June 11, 2025
HomeNewsRAHUL GANDHI: ప్రచారార్భాటమే తప్ప వాస్తవాలు లేవు!

RAHUL GANDHI: ప్రచారార్భాటమే తప్ప వాస్తవాలు లేవు!

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.కేంద్రం కేవలం ప్రచారానికే పెద్దపీట వేస్తోందని, జవాబుదారీతనం లేదని ఆరోపణ.రైల్వేల దుస్థితి, ప్రజాస్వామ్య సంస్థల బలహీనపడటంపై ధ్వజం.

RAHUL GANDHI : మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం పాలన తీరు, నిర్లక్ష్యం, కేవలం ప్రచారానికే పరిమితమైన విధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల దుస్థితి, ప్రజాస్వామ్య సంస్థల బలహీనపడటం, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి అంశాలను ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని నిలదీశారు.

రైల్వేలు అభద్రతకు నిదర్శనంగా మారాయి…
మహారాష్ట్రలోని ఠాణె రైలు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్రంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రద్దీ రైలు నుంచి జారిపడి నలుగురు మరణించడం, ఆరుగురు గాయపడటంపై ఆయన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనా సంబరాలు చేసుకుంటుండగా, ముంబై నుండి వచ్చిన ఈ దురదృష్టకర వార్త దేశంలో ప్రస్తుత పరిస్థితులను అద్దం పడుతోందన్నారు. భారతీయ రైల్వేలు కోట్లాది మందికి జీవనాడి, కానీ నేడు అవి అభద్రత, రద్దీ, అస్తవ్యస్తతకు ప్రతీకలుగా మారాయని పేర్కొన్నారు. మోదీ సర్కార్ పాలనలో జవాబుదారీతనం కొరవడింది, కేవలం ప్రచారం మాత్రమే కనిపిస్తోందని విమర్శలు చేశారు. 2025 గురించి మాట్లాడకుండా 2047 కలలు కంటున్నారని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రభుత్వ పనితీరుని తీవ్రంగా ఖండించారు.

రాజ్యాంగంపై నియంతృత్వ ఛాయలు….
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరింత దూకుడుగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు.

“రాజ్యాంగంలోని ప్రతి పుటపై నియంతృత్వ శక్తుల కలం సిరా పడింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బలహీనపరిచి, వాటి స్వయంప్రతిపత్తిపై దాడి చేశాయి. రాష్ట్రాల హక్కులను విస్మరించాయి, సమాఖ్య వ్యవస్థ బలహీనపడింది. ద్వేషం, భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి”
_____________________ మల్లిఖార్జున ఖర్గే

ఆర్థిక వ్యవస్థ పతనం, బలహీన వర్గాలపై కుట్ర…
గడిచిన 11 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాలపై దోపిడీ పెరిగిందని, వారి రిజర్వేషన్లను హరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మణిపూర్‌లో హింస బీజేపీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. “ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి బదులుగా, యువత నుంచి కోట్లాది ఉద్యోగాలు లాక్కుంటున్నారు. ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటివి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ నిర్మించిన మౌలిక సదుపాయాలకు మోదీ కేవలం రిబ్బన్ కత్తిరింపులకే పరిమితమవుతున్నారు” అని ఖర్గే తీవ్రమైన అభియోగాలు మోపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News