Maid Steals Over Rs 1 Crore : నమ్మిన వాడు నట్టేట మునిగెడు అనే సామెతను నిజం చేస్తూ, కర్ణాటకలోని చామరాజ్పేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ ఇంటి పనిమనిషి ఏకంగా కోటి రూపాయల విలువైన సొత్తుతో పరారై, యజమానురాలికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. నమ్మకాన్ని వమ్ము చేసే ఈ ఘటన కర్ణాటకలోని చామరాజ్పేట జిల్లాలో చోటు చేసుకుంది. ఎలాంటి అనుమానం రాకుండా ఇంత భారీ మొత్తాన్ని ఆమె ఎలా మాయం చేయగలిగింది? అసలు ఆమెకు ఇంతటి తెగువ ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, ఈ దొంగతనం వెనుక ఉన్న పూర్తి కథనాన్ని పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందే..!
నమ్మకంతో నియమించుకున్న రాధ
వివరాల్లోకి వెళ్తే… నగరంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రాధ, నగర్తపేటలో ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నారు. రోడ్ నంబర్ 3లో నివసించే ఆమె, తన అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సుజాతను చూసుకోవడానికి ఓ సహాయకురాలు కావాలని భావించారు. ఈ క్రమంలోనే చామరాజ్నగర్ జిల్లా, ఇలియాస్ నగర్కు చెందిన ఉమ అనే మహిళను మూడు నెలల క్రితం నెలకు రూ. 23,000 జీతానికి పనిలో పెట్టుకున్నారు. నమ్మకంతో ఇంట్లోకి ఆహ్వానించి, కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు.
బీరువా తీసి చూడగానే…..
రాధకు ఇటీవల పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. రెండు నెలల క్రితం ఆమె ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని తన ప్లాట్ను విక్రయించి, ఆ మొత్తాన్ని ఇంట్లోని అల్మారాలో భద్రపరిచింది. మొత్తం రూ. 67 లక్షల నగదు, రూ. 33 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఆ అల్మారాలోనే ఉన్నాయి. జూన్ 9న కొత్త ప్లాట్ కొనేందుకు ఆ డబ్బు తీసుకోవడానికి రాధ అల్మారా తెరిచి చూసింది. అందులో డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెందింది.
సీసీటీవీలో దొరికిన ఆధారాలు :
ఆందోళనతో వెంటనే ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసింది రాధ. జూన్ 4 ఉదయం, పనిమనిషి ఉమ తన చేతిలో ఓ పెద్ద బ్యాగుతో బయటకు వెళ్లడం సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యింది. అప్పుడు కానీ రాధకు అనుమానం రాలేదు. ఉమను పిలిచి నిలదీయగా, “నాకేమీ తెలియదు” అని బుకాయించింది. కానీ రాధకు ఉమపై అనుమానం బలపడింది.
చివరికి కటకటాల పాలు :
రాధ వెంటనే చామరాజ్పేట పోలీస్ స్టేషన్లో ఉమపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఉమను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తమదైన శైలిలో విచారించగా, చివరకు నిజం బయటపడింది. కోటి రూపాయల విలువైన నగదు, ఆభరణాలు తానే అపహరించినట్లు ఉమ ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు, పోలీసులు ఉమ కుమార్తె ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ రూ. 50.57 లక్షల నగదు, రూ. 12.66 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము, ఆభరణాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.