Digital revolution in Telangana government schools : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో (ఎన్జీఓ) అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనను ఉచితంగా అందించడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యను అందించి వారిని పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా చేయడమే తమ ధ్యేయమని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎంఓయూలు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచుతాయని ఆశిస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తోన్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకొంది.
ప్రాథమిక విద్య బలోపేతం: విద్యార్థులకు వ్యక్తిగత అభ్యాసాన్ని అందిస్తూ, గ్రామీణ విద్యార్థులు కూడా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, తెలంగాణ ప్రభుత్వం 3-5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణిత ప్రాథమికాంశాలపై దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత బోధనను ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్’ ద్వారా 540 పాఠశాలల నుంచి 5,000కు పైగా పాఠశాలలకు విస్తరిస్తున్నారు.