Friday, June 13, 2025
Homeపాలిటిక్స్BIHAR POLITICS: నితీశ్‌కు చిరాగ్ చెక్ పెడతారా? 2005 సీన్ రిపీట్ అవుతుందా?

BIHAR POLITICS: నితీశ్‌కు చిరాగ్ చెక్ పెడతారా? 2005 సీన్ రిపీట్ అవుతుందా?

BIHAR POLITICS : బిహార్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. లోక్ జనశక్తి – రామ్ విలాస్ (ఎల్‌జేపీ – ఆర్‌వీ) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉంటూనే రాష్ట్ర రాజకీయాలపై తన దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆయన గట్టి పోటీనిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ వ్యూహం నితీశ్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2020 ఎన్నికల ఫలితాలు – చిరాగ్ ప్రభావం
2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసి, నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు భారీ నష్టాన్ని కలిగించారు. జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి 43 సీట్లకే పరిమితం కాగా, బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది. ఎల్‌జేపీ ఒకే సీటు గెలిచినా, జేడీయూ ఓటమికి చిరాగ్ వ్యూహం కీలకమైంది. జేడీయూ పోటీ చేసిన 38 స్థానాల్లో ఎల్‌జేపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రాగా, 26 చోట్ల జేడీయూ ఓటమికి ఎల్‌జేపీ ఓట్లే కారణమయ్యాయి.

తండ్రి బాటలో కొడుకు: 2005 నాటి వ్యూహం
2005 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ విలాస్ పాశ్వాన్ కింగ్ మేకర్‌గా మారి, లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. లాలూకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి 29 సీట్లు గెలుచుకున్న ఆయన, మతతత్వ, అవినీతి పార్టీలతో కలవబోనని ప్రకటించి, ముస్లిం ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తానని చెప్పారు. దీనివల్ల బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించారు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నితీశ్ కుమార్ తొలిసారి సీఎం అయ్యారు. ఇప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అదే వ్యూహాన్ని నితీశ్‌పై ప్రయోగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తనను తాను ‘మోదీ హనుమంతుడు’గా అభివర్ణించుకుంటూ, ఎన్‌డీఏలో ఉంటూనే జేడీయూకు సవాలు విసురుతున్నారు.

సీట్ల సర్దుబాటు, కింగ్ మేకర్ పాత్ర
రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు చిరాగ్ పాశ్వాన్‌కు కీలక అంశం కానుంది. 2020లో జేడీయూను ఓడించిన 32 సీట్లపై ఎల్‌జేపీ గురి పెట్టింది. బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉన్నందున, జేడీయూనే సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందని అంచనా. ఒకవేళ జేడీయూ సీట్లు తగ్గి, ఎల్‌జేపీ బలం పుంజుకుంటే, చిరాగ్ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. అప్పుడు నితీశ్ ముఖ్యమంత్రి పీఠానికి ప్రమాదం ఏర్పడవచ్చు. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతాయి కాబట్టి, ఫలితాల తర్వాత చిరాగ్ తేజస్వి యాదవ్‌తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. బీజేపీ, నితీశ్‌ను దారికి తెచ్చుకునే అవకాశం ఉంది, ఒకవేళ కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News