Saturday, October 19, 2024
Homeపాలిటిక్స్CM Revanth assurance to Real estate companies: రియల్ ఎస్టేట్ సంస్థలూ భయపడద్దు,...

CM Revanth assurance to Real estate companies: రియల్ ఎస్టేట్ సంస్థలూ భయపడద్దు, హామీ నాది: సీఎం రేవంత్

గీతా రెడ్డికి రాజీవ్ గాంధీ సద్భావనా అవార్డ్..

రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని గుర్తు చేసిన సీఎం రేవంత్.. ప్రతి ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతా రెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయన్న రేవంత్.. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూసామని, కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని రేవంత్ అన్నారు. పేదలకు మేలు జరిగేది గాంధీకుటుంబంతో మాత్రమేనంటూ సీఎం నొక్కి చెబుతూ.. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందన్నారు.

- Advertisement -

హైడ్రా ఓ భూతం, అంకుశం..

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ దంటూ ఆయన కొనియాడారు. పదవులను ఇతరులకు ఇచ్చి దార్శకనికతను చూపిన గొప్ప వ్యక్తులని, గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికా? అని నిలదీశారు. మత సమరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని, హైడ్రా ఆక్రమణలకు పాల్పడ్డ బడా బాబుల పట్ల భూతం అన్న సీఎం, ప్రభుత్వ భూములను, నాళాలు, చెరువులను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టిన వారిపట్ల హైడ్రా అంకుశం లాంటిదన్నారు.

రియల్ ఎస్టేట్ కు మా అండ..

మదపుటేనుగులను అనచడానికి హైడ్రా అంకుశంలా పనిచేస్తుందని, కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక మూలలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని, రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దు… వారికి నేను హామీ ఇస్తున్నా అంటూ రేవంత్ ప్రకటించటం విశేషం. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైడ్రా అనగానే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారని, పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని రేవంత్ ఆరోపించారు. మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని, మేం వారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆరెస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు.

బిల్లాలు, రంగాలు వచ్చి..

బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారని, అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం పద అంటూ మరోమారు సవాల్ విసిరారు. గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా అన్న ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వాళ్ల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. హరీశ్.. నీలాంటి చెప్పులు మోసే వారు కాదు.. ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్లను రమ్మను నేను వస్తానంటూ రేవంత్ గర్జించారు.

నీది ఒక స్థాయేనా..

నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులు మర్చిపోయావా? అని రేవంత్ పరుషంగా వ్యాఖ్యానించారు. ఫామ్ హౌసులు కాపాడుకునేందుకే బిల్లా రంగాల దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని, మూసీ పునరుజ్జీవనం వేరు… హైడ్రా వేరు.. అని స్పష్టంగా పేర్కొన్నారు. మూసీ లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని, ట్రాఫిక్ సమస్య, నాళాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రా అని చెప్పుకొచ్చారు. వాళ్ల తాపత్రయం అంతా వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకేనంటూ నిప్పులు చెరిగిన సీఎం, అక్కడికి ఇక్కడికి కాదు…ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ల ఫామ్ హౌస్ ల వద్దకు ఎప్పుడు రావాలో హరీష్ చెప్పాలన్నారు. హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్ ల విషయంపై అఖిలపక్షం పిలుద్దాం.. నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దాం..ఆ తరువాత మూసీ దగ్గరకా.. ఇంకెక్కడికైనానా వెళదాం..అంటూ ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొనటం హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News