Saturday, November 15, 2025
Homeపాలిటిక్స్CM Shibu Soren: జార్ఖండ్ మాజీ సీఎం, ఉద్యమ నేత శిబు సోరెన్‌ ఇక లేరు!

CM Shibu Soren: జార్ఖండ్ మాజీ సీఎం, ఉద్యమ నేత శిబు సోరెన్‌ ఇక లేరు!

Former Jharkhand CM Shibu Soren: జార్ఖండ్ రాజకీయాలకు ఊపిరి పోసిన ప్రముఖ నాయకుడు శిబు సోరెన్ ఇకలేరు. ఆయన్ను దేశవ్యాప్తంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన ఓ అగ్రనాయకుడిగానే గుర్తు పడతారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ప్రాణాలు విడిచారు.

- Advertisement -

ఆరోగ్యం విషమంగా..

శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉండటంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండి చూసుకుంటున్నారు. 1972లో శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. అప్పట్లో బిహార్‌లో భాగంగా ఉన్న జార్ఖండ్ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆయన ఉద్యమం ప్రారంభించారు. గిరిజనుల జీవనస్థితిని మెరుగుపరిచేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు ఆయన కొనసాగించిన ఉద్యమం దశాబ్దాల పాటు సాగింది.

రాజకీయాల్లో ముఖ్యపాత్ర..

తన దీర్ఘకాల పోరాట ఫలితంగా జార్ఖండ్ రాష్ట్రం 2000లో బిహార్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ సందర్భంగా శిబు సోరెన్ నాయకత్వం మరింత బలపడింది. ప్రజల మద్దతుతో ఆయన పార్టీ జార్ఖండ్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించగలిగింది.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా…

శిబు సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 2005లో కేవలం పదిరోజులే అధికారంలో ఉన్నారు. తరువాత 2008 నుంచి 2009 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. మూడోసారి ఆయన 2009 నుంచి 2010 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అయితే, మూడు సార్లూ ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు.

ఎనిమిదిసార్లు ఎంపీగా..

పార్టీ స్థాపన, ముఖ్యమంత్రి పదవులు మాత్రమే కాకుండా ఆయన కేంద్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఈ గెలుపు ఆయన ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా కూడా శిబు సోరెన్ పనిచేశారు. పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ ఆయన నేతృత్వం గిరిజన వర్గాలకు గొంతుగా నిలిచింది.

ఆయన జీవితం అంతా ప్రజల పక్షాన గడిచింది. చిన్న వయసులోనే సామాజిక సమస్యలపై శ్రద్ధ పెంచుకున్న ఆయన, విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బీహార్‌లో గిరిజన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజలను సంఘటితంగా మేళవించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై ప్రభుత్వ దృష్టి నిలిపేందుకు శిబు సోరెన్ నిరంతరం పనిచేశారు.

అనేక పార్టీలకు ప్రేరణగా…

జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ఆయన నిర్మించిన విధానం, ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన మార్గం అనేక పార్టీలకు ప్రేరణగా నిలిచింది. హక్కుల కోసం జరిగిన ఉద్యమాలే కాకుండా, ఆయన రాజకీయ సమర్ధత కూడా గమనించదగ్గది. తక్కువ పదవీకాలాల్లోనూ ప్రజల సమస్యలపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ తన తండ్రి మార్గంలోనే కొనసాగుతున్నారు. కుటుంబ రాజకీయాలపై ఉన్న విమర్శల మధ్య కూడా శిబు సోరెన్ కొడుకు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. తండ్రి మరణవార్తను అధికారికంగా ప్రకటించిన హేమంత్ సోరెన్, ఆయన సేవలను జార్ఖండ్ ఎప్పటికీ మరిచిపోలేదని తెలిపారు.

Also Read: https://teluguprabha.net/national-news/india-bloc-dinner-diplomacy-rahul-gandhi-meeting/

శిబు సోరెన్ మరణం దేశ రాజకీయాల్లో ఒక శూన్యాన్ని తీసుకువచ్చిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సంతాపం తెలిపారు.జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యాలయానికి మృతదేహాన్ని తరలించి, అక్కడ నుండి స్వగ్రామమైన జార్ఖండ్‌లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ స్తాయిలో అధికారిక గౌరవాలతో ఆయనకు చివరి వీడ్కోలు ఇవ్వాలని సీఎం కార్యాలయం ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad