నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెల్లడించారు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించిన హరీష్, ఆ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడదామని హెచ్చరించారు.
ప్రశ్నార్థకంగా ఆ ప్రాజెక్టులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేటలోని తన నివాసంలో హరీశ్ రావు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఆదేశాలతో
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో చేసే పోరాటం గురించి ఈ సమావేశంలో చర్చించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్ లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. కాగా అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదనేది గులాబీ నేతల ఆరోపణల సారాంశం. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులతో 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.