ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే పక్షంగా వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ప్రతిపక్షం ఉంటేనే ఏ సభకైనా సార్థకత
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమయం ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశంతోనే వైయస్ఆర్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైయస్ జగన్ కోరుతున్నారు. దీనివల్ల ప్రత్యేకంగా వచ్చే హంగూ ఆర్భాటం ఏమీ లేదు. మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు తమ పాలనలోని వైఫల్యాలను వారే సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయగలరు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ఏ సభకైనా సార్థకత లభిస్తుంది. పాలనలోని మంచి చెడులను ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ద్వారా ప్రజాగళంను సభలో వినిపించడం ప్రతిపక్షం బాధ్యత. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఇలా చేయగలవా? దీనిపైన వైయస్ జగన్ మాట్లాడిన దానిని వక్రీకరించడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి తెగబడింది.
పవన్ కళ్యాణ్ వి అవగాహన లేని వ్యాఖ్యలు
ప్రతిపక్షంగా గుర్తించాలన్న వైసీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా స్పందించడం దారుణం. అసెంబ్లీలో జనసేన రెండో అతిపెద్ద పార్టీగా ఉందని, ప్రతిపక్షంగా గుర్తించాల్సి వస్తే తమకే అవకాశం ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, తమకే ప్రతిపక్షం దక్కుతుందని ఎలా మాట్లాడుతున్నారు? ప్రజాస్వామిక స్పూర్తి గురించి పవన్ కు కనీస అవగాహన కూడా లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. అంతగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ కు ఉత్సాహంగ ఉంటే ఆయన తక్షణం ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. అప్పుడు తనను ప్రతిపక్షంగా గుర్తించమని అడగాలి. అలా అడిగే ధైర్యం పవన్ కు ఉందా?
ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తారని భయం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా, వాటిపై వైసీపీ ప్రశ్నిస్తుందనే భయంతోనే ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పే బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ పావుగా మారిపోయారు. చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది పవన్ కళ్యాణ్ నోటితో చెప్పిస్తున్నారు.
వీరి కుట్రలో షర్మిలను భాగస్వామిని చేస్తున్నారు
ఇంకో పక్క కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను కూడా తన కుట్రలో భాగస్వామిని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ షర్మిల ప్రజాసమస్యలను పక్కకు పెట్టి, వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాకపోతే ఎమ్మెల్యేల సభ్యత్వం పోతుందని మాట్లాడే జోకర్లు, ఆనాడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి, అధికారంలోకి తెచ్చిన జగన్ చరిత్ర గుర్తు చేసుకోవాలి.
ప్రతిపక్ష గుర్తింపు గురించి వైయస్ జగన్ కోర్టును ఆశ్రయించారు. దానిపై స్పీకర్ ను న్యాయస్ధానం 4 నెలల క్రితమే వివరణ కోరినా ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు. న్యాయస్థానాలను గౌరవించే తీరు ఇదేనా? శాసన వ్యవస్థలో అధికారపార్టీ ఎంత ముఖ్యమో, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి.