![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-5.44.24-PM-1-1024x641.jpeg)
విజయవాడ నగర పాలక సంస్ధ వైయస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. కార్యకర్త కోసం జననన్న 2.0 ఎలా పని చేస్తాడో చూపుతానన్నారు.చంద్రబాబు పాలనలో మన పార్టీ కార్యకర్తలకు వేధింపులు, కార్యకర్తల ఇబ్బందులు, వారి బాధలన్నింటినీ గమనించాను. వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ చూస్తూనే ఉన్నాను. పార్టీలో ప్రతి కార్యకర్తకు మీ జగన్ అండగా ఉంటాడు వైయస్ జగన్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు సహజం. కష్టాలు వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఇది వాస్తవం రాజకీయంగా ఎదుగుతున్నానని నాపై కక్ష కట్టారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రతో 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఎక్కడా తగ్గలేదు. ఎంతో ధైర్యంతో నిలబడ్డాను. ప్రజల్లో నిల్చాను. వారి అండతో సీఎం అయ్యాను. మన పార్టీ తప్పక తిరిగి అధికారంలోకి వస్తుంది.30 ఏళ్ల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తామని వైయస్ జగన్ వెల్లడించారు.
కోవిడ్ వంటి విపత్తులోనూ ప్రజలకు మేలు చేశాం. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు. ప్రజా సంక్షేమాన్ని, పథకాలను ఏనాడూ ఆపలేదు. వైయస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నానని మరో సారి గుర్తు చేస్తాన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో అంతా అరాచకం. 9 నెలల్లోనే అన్ని వ్యవస్ధలను నాశనం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీల అమల్లో విఫలమైంది. కూటమి పాలనలో ప్రతిదాంట్లోనూ స్కామ్. ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు వరకు వాటాలు. కాలర్ పట్టుకుని ప్రజలు నిలదీస్తారని భయం. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి పాలనపై వైయస్ జగన్ ఫైరయ్యారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-5.44.25-PM-1024x475.jpeg)
కార్యకర్తలకు అండగా జగన్:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నాను. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్ధలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు.
కష్టాలు ఎల్లకాలం ఉండవు:
రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకొండి.
నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి, ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు. దొంగ కేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తు పెట్టుకొండి.
అందుకు నేను గర్వపడుతున్నాను:
విజయవాడ కార్పొరేషన్లో 64 స్దానాలుంటే 49 స్దానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్ధానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలతోనో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అందుకు కారణం ఏమిటంటే.. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా కూడా.. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత వాటికి ఎన్నికలు జరిగితే, మన పార్టీ క్లీన్స్వీప్ చేయగలిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతి నెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన కేలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ఏటా, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే.
కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం:
ఆరోజు కోవిడ్ వంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. ఇలాంటి విపత్తు ఒకటి ఉంటుందా? ఇలాంటిది వస్తే రాష్ట్రం, దేశం అతలాకుతలం అవుతుందన్న పరిస్థితులు ఎప్పుడూ ఊహకు కూడా అంది ఉండవు. అలాంటిది వరుసగా రెండేళ్లు కోవిడ్ సమస్యలతో అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలూ తగ్గాయి. అయినా ఏ రోజు కూడా మనం సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏరోజూ తప్పలేదని వైయస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నాను. ప్రజలకు మంచే చేశాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం నిలబడి ఉన్న పార్టీ. నా దగ్గర నుంచి గ్రామస్ధాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. నిలబడింది.
ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి
వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.
ఆ భయంతోనే రెడ్బుక్ రాజ్యాంగం:
కానీ, ఎన్నికలు జరిగి 9 నెలలు కూడా తిరక్క ముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే మొదలు.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు.. వాటిని ప్రజలు తిరిగి చూపిస్తారు.
పిల్లలు తమకిస్తామన్న రూ.15వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు తమ రూ.18 వేలు ఏమయ్యాయని, ఆ ఇంట్లో 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు తమకిస్తామన్న రూ.45 వేలు ఏమయ్యాయని, అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు తమకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.36 వేల గురించి నిలదీస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు తమ రూ.20 వేల పెట్టుబడి సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆరోజు మేం చేయకపోతే కాలర్ పట్టుకొండని అన్నారు. అదే మాట గుర్తు చేస్తూ, ఈరోజు ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని భయపడి రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.
ఆరోజే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది:
ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే మాటను ఆరోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ‘చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే.. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే’ అని చెప్పాను.
మన మ్యానిఫెస్టో, వాళ్ల హామీలు చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు.
చేసేదే చెప్పాం. చెప్పించే చేశాం:
‘రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరోవైపు చంద్రబాబునాయుడు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడు. సూపర్ సిక్స్ మోసం. సూపర్ సెవెన్ మోసం’.. అని చెబుతూ, మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ప్రజలకు అర్ధం అయ్యేట్లుగా చెప్పాం. ఆరోజు కూడా మన ప్రజా ప్రతినిధులు, మన శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనమూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పాను. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పాను. ఓడిపోయాం ఫరవాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే.. ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం.
జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతోంది.
ప్రజలు పోల్చి చూస్తున్నారు:
గత ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే, రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పగడ్భందీగా జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది.
జగన్ ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిషు మీడియం వచ్చింది. నాడు–నేడుతో స్కూళ్లు బాగుపడ్డమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది డిజిటైజ్ అయింది. జగన్ ఉన్నప్పుడే 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు కనిపించేవి. మరోవైపు ప్రైవేట్ బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్ధితి రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొదటిసారిగా గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి.
ఇప్పుడు అన్నీ పోయె..!:
మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి, తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపిస్తూ.. వాళ్లు ఎదగాలని, భావి ప్రపంచంతో పోటీ పడాలని, వారు ఎంతో ఎదగాలని పిల్లల చదువుల్లో మార్పు తీసుకొచ్చిన రోజులు మన పాలనలో చూస్తే.. కేవలం 9 నెలల్లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే.. నాడు–నేడు పాయో. అమ్మఒడి పాయే. ఇంగ్లిషు మీడియం పాయే. ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులకు ఇచ్చే కార్యక్రమం పాయే. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ పాయే.. వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశాను. 70 శాతం బడుల్లో 70 మంది పిల్లలు కూడా లేరు అని రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.
నాడు వైద్య ఆరోగ్య రంగం:
పేదవాడకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పేదవాడి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారైంది. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదు.
అదే మన ప్రభుత్వంలో పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడం, ప్రొసీజర్లు 1000 నుంచి 3,300కు పెంచడంతో పాటు, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రులను 900 నుంచి 2,400కు పెంచాం. గవర్నమెంటు ఆస్పత్రుల్లో వైద్యులు, నర్స్ల కొరత అన్నది పరిపాటే అన్న సంప్రదాయాన్ని మార్చివేశాం. మొదటిసారిగా గవర్నమెంటు ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే, మందులు దొరకని పరిస్ధితి నుంచి.. మందుల కోసం వెళ్తే డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే దొరికేలా చేసిన ప్రభుత్వం కూడా ఒక్క వైయస్సార్సీపీదే.
మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అక్కడ 105 రకాల మందులు సరఫరా చేస్తూ.. 24 గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, అందుబాటులోకి ఉండేటట్లు.. 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు (డయాగ్నస్టిక్ టెస్టులు) కూడా అక్కడే చేసేలా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. తొలిసారిగా పీహెచ్సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలో ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్లో ఊళ్లలో అందుబాటులో ఉండేలా చూశాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి, నెలలో కనీసం రెండు రోజులు ఆ ఊళ్లకు వెళ్లేలా చేస్తూ ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెఫ్ట్ను అందుబాటులోకి తెచ్చింది కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వమే.
ఇంకా కనీవీని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా వైయస్సార్సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయింది. విలేజ్ క్లినిక్లు పని చేయడం లేదు. పీహెచ్సీలు కూడా పని చేయడం లేదు. రూ.3 వేల కోట్లు నెట్వర్క్ ఆస్పత్రుల బిల్లలు చెల్లించ లేదు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.300 కోట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పేదలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ఇదీ.. మన ప్రభుత్వానికి, వీళ్ల ప్రభుత్వానికి తేడా.
అన్ని వ్యవస్థల విధ్వంసం:
మొట్టమొదటిసారిగా రైతులకు ఆర్బీకేలు తీసుకుని రావడం, ఇ–క్రాప్ చేయడం, దళారీ వ్యవస్ధ తీసివేసి ఆర్బీకే ద్వారానే రైతులకు కనీస గిట్టుబాటు ధర లభ్యమయ్యేలా కొనుగోలు చేయడం, అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కూర్చుని వ్యవస్ధను మార్చేలా తీసుకున్న చర్యలన్నీ కూటమి ప్రభుత్వంలో నాశనం అయ్యాయి.
గ్రామంలో ప్రతి సేవకు సచివాలయం ఏర్పాటు చేసి, ఎవరెవరు ఏ సేవలు చేయాలో నిర్ణయించాం. ప్రతి 50–60 ఇళ్లకు వాలంటీర్ను తీసుకొచ్చి ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలన్నీ ఇవాళ నాశనం అయ్యాయి. కేవలం తొమ్మది నెలల్లోనే వ్యవస్ధలన్నీ నాశనం అయ్యాయి.
మరోవైపు ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపునకు రూ.2 లక్షలకో, రూ.3 లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు తీసివేసి ప్రైవేట్ షాపులు తీసుకొచ్చారు.
ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. ఇవాళ వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజలకు మంచిగా కనిపిస్తున్నారు. ఆ స్ధాయిలో 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారని శ్రీ వైయస్ జగన్ వివరించారు.