Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్KCR @ Dharmapuri: రాహూల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా?

KCR @ Dharmapuri: రాహూల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా?

సచ్చినా సరే మీటర్లు పెట్టనని చెప్పా

ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు :

- Advertisement -

• తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కొలువైన పవిత్ర క్షేత్రమైన ధర్మపురి భూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
• ‘‘భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!’’ అంటూ స్థానిక కవి శేషప్ప రాసిన పద్యాలను చిన్నప్పటి నుంచీ చదువుకుంటున్నాం.
• నాడు గోదావరంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడనే ఉండేది. ధర్మపురిలో గోదావరి నది ఉన్నదన్న విషయాన్ని కూడా మరిచారు.
• ఉద్యమ సమయంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని.. ఇక్కడ గోదావరి పుష్కరాలను నిర్వహించాలని డిమాండ్ చేసేదాక ఇక్కుడున్నా ఏ నాయకులకూ సోయి లేకుండె.

• నేను డిమాండ్ చేసిన తర్వాతనే గోదావరి పుష్కరాలు ధర్మపురిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ మనం ఘనంగా నిర్వహించుకున్నాం.
• నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిందే టీఆర్ఎస్.
• దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయినా ప్రజాస్వామ్యానికి రావాల్సిన పరిణతి రావట్లేదు.
• ఎన్నికల్లో నిలబడే వ్యక్తుల వెనుక ఉండే పార్టీల చరిత్ర ఏంది? ఏం చేసింది? ప్రజల గురించి ఆ పార్టీ నడవడిక ఏంది? ఆ పార్టీ దృక్ఫథం ఏంది? అనే విషయాలపై చర్చ చేయాలె.
• దేశంలోని మన ఎన్నికల్లో ఎప్పటివరకైతే ప్రజలు గెలువరో, అప్పటివరకూ సరైన అభివృద్ధి లేకుండా ఉంటది.
• మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా మీకు విషయాలన్నింటినీ చెప్పడం నా బాధ్యత.
• ప్రజల దగ్గరున్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు.. మన భవిష్యత్తును నిర్ణయించి, తలరాతను మారుస్తుంది. ఆషామాషీగా వేయకండి.
• పంటి కంటకుండా మింగుదామని గతంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ ఒక ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నది.
• ఎన్నోసార్లు కాంగ్రెస్ కు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదు.


• కొప్పుల ఈశ్వర్ గెలిచాక ధర్మపురి ఎలా అభివృద్ధి చెందింది.. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉండెనో తేడాను గమనించాలి.
• టెయిల్ ఎండ్ కాలువలు, ప్రాజెక్టులు, నీళ్లు.. చాలా అభివృద్ధి పనుల గురించి కొప్పుల ఈశ్వర్ పనులు పూర్తిచేశాడు.
• ఇవ్వాల ధర్మపురిలో బ్రహ్మాండంగా దాదాపు లక్షా ముప్పై వేల ఎకరాలు సాగవుతున్నది. పంటలకు నీళ్లొస్తున్నాయి. ఈ తేడాలను మీరు గమనించాలి.
• గతంలో మహామహులైన ఎమ్మెల్యేలున్నా ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారు. కొప్పుల ఈశ్వర్ మాత్రమే అనేక అభివృద్ది పనులు చేశాడు.
• మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగాయి. ఈశ్వర్ అనేక చెక్ డ్యామ్ లను కట్టించాడు.
• తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో అంతా అస్తవ్యస్తంగా ఉండేది. అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుండేవి.


• కొత్త రాష్ట్రంలో నాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీరు లేదు, ప్రజల వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారం.
• నేడు మంచినీళ్ల సమస్య లేదు, దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ.
• రైలు, ఓడరేవులు, విమానాలు, కరెంటు తదితర రంగాలన్నింటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేశాయి.
• మోదీ కరెంటును ప్రైవేట్ చేసి.. మోటార్లకు మీటర్లు పెట్టి ఖచ్చితంగా వసూలు చేయాలని నాకు చెబితే సచ్చినా సరే మీటర్లు పెట్టనని చెప్పాను.


• మోటార్లకు మీటర్లు పెట్టకుంటే సంవత్సరానికి 5వేల చొప్పున మొత్తం 25 వేల కోట్లు మనకు రావాల్సినవి మోదీ ఇవ్వలేదు.
• భవిష్యత్తులో కూడా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టను.
• విద్యారంగంలో అన్ని వర్గాల ప్రజలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం.
• గతంలో రైతులకు అప్పులుంటే వాళ్ల తలుపులు బ్యాంకోల్లు తీసుకపోయినరు తప్ప రైతులకు ఆర్థిక సాయం చేయాలని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ ఆలోచించలేదు.
• ‘రైతు బంధు’ను దేశంలో సృష్టించిందే కేసీఆర్.
• గతంలో రాబంధులు తప్ప ‘రైతు బంధు’ లేదని మీరు గమనించాలె. చర్చించాలి.
• ఇవ్వాల రైతు బంధుతో రైతులందరూ అప్పులు కట్టుకుంటూ, సొంత పెట్టుబడి పెట్టుకుంటూ, మందు బస్తాలకు మూడు, నాలుగు రూపాయల వడ్డీ కూడా లేకుండా, దళారుల బాధ లేకుండా సంతోషంగా ఉన్నారు.


• బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంటును ఇస్తూ, ధాన్యాన్ని మొత్తం కొంటున్నది.
• ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహూల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా?
• ధరణి పోర్టల్ రాకముందే అనేక భూమి గొడవలు ఉండేవి. ధరణి వచ్చాక రైతుల భూములు భద్రంగా ఉన్నయ్.
• ధరణితో దళారీలు, లంచాలు లేకుండా మండల కేంద్రాల్లోనే వెంటనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.
• విధివశాత్తూ రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా డబ్బులు ధరణి ద్వారానే వస్తున్నాయి.
• రైతులు పంటనమ్మితే వచ్చే డబ్బులు డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్లలో పడుతున్నది.
• కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తే రైతులకు వచ్చే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎట్లొస్తయ్?


• కాంగ్రెస్ మాటలు విని ఆగమాగమైతే కైలాసం ఆటల మళ్లీ పెద్దపాము మింగినట్లైతది.
• కాంగ్రెస్ రాజ్యమే పైరవీకారులు, దళారుల రాజ్యం. వాళ్లొస్తే ధరణిని తీసేస్తరు జాగ్రత్త.
• గతంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలితే రైతుల దగ్గర రెండు వేలు, మూడు వేలు వసూలు చేసేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా చేసినం.
• రైతు బంధు పెట్టుమని నాకెవరూ దరఖాస్తు ఇవ్వలేదు. దళితబంధు పెట్టుమని నన్నెవరూ అడగలేదు. నేనే స్వయంగా పెట్టిన.
• కొప్పుల ఈశ్వర్ 80 వేల మెజార్టీతో గెలువగానే ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి దళితబంధును ఒక్కసారిగా మంజూరు చేస్తా.
• తరతరాలుగా దోపిడీ, అణిచివేతలకి గురైన దళితుల సంక్షేమం కోసమే దళిత బంధును పెట్టినం.


• భారతదేశంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు లాంటి పథకాన్ని పెట్టలేదు. ఆలోచించలేదు.
• రాష్ట్రాభివృద్ధికి ప్రామాణికమైన తలసరి ఆదాయం, విద్యుత్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
• కుల మతాలు చూడకుండా అందర్నీ కలుపుకుంటూ పదేండ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా చేశాం.


• ధర్మపురి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించాం. అవసరమైతే మరిన్ని నిధుల్ని కేటాయిస్తాం.
• కార్మికునిగా పనిచేసి ఎదిగినవాడు, సౌమ్యుడు అయిన కొప్పుల ఈశ్వర్ ను గెలిపిస్తే ధర్మపురి నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుంది.
• కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News