Tuesday, July 2, 2024
Homeపాలిటిక్స్KCR fire on leaders quitting BRS: పార్టీని వీడి దొంగల్ల కలిసెటోళ్ల గురించి...

KCR fire on leaders quitting BRS: పార్టీని వీడి దొంగల్ల కలిసెటోళ్ల గురించి బాధలేదు

నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు

సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి వున్నయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నదని అన్నారు.

- Advertisement -

ఆ సత్తా మాకే ఉంది..

తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ కు మాత్రమే ఉన్నదని కేసీఆర్ వివరించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ కార్యకర్తల సమావేశం ఈరోజు కూడా కొనసాగింది. కోరుట్ల జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..”మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి వుంది. ప్రజలు అవకాశమిస్తే..గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధనదిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలను పొందినం.కుల మతాలకతీతంగా పని చేస్తూ వ్యవసాయం,సాగునీరు,విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపినం. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసినం. అయితే…అయితే కొన్ని కొన్ని సార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది.అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతికాదు. మనం ఏ హోదాలోవున్న కానీ ప్రజలకోసం పనోచేయాల్సిందే. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తాం. ఆనాడు మనం ఉద్యమంలకు దిగినప్పుడు మనతో ఎవరున్నారు?”.

లీడర్లను పార్టీ తయారు చేసుకుంది..

“నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారు చేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది.” అని వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కే. సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టర్ గా మరోపక్క ఎమ్మెల్యేగా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కేసీఆర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో..మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ , ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్,జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి టీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

కాగా.. అంతకు ముందు..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, జాజల సురేందర్, హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News