Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Patancheru: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవ్వండి

Patancheru: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవ్వండి

పూర్తి ఆధిపత్యం మాదే

కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి వెన్నుముక, పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కార్యకర్తల కృషితో మెదక్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకోబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ స్థాయి కృతజ్ఞతా సభ-స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే గూడెం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థి వెంకటరామి రెడ్డి విజయ కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. భారీ మెజారిటీతో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సూచించారు. గత పదేళ్లలో ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేసామని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనన్ని పనులు పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ గ్రామాన ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటును అడగాలని కోరారు.

- Advertisement -


దొంగ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో మీన మేషాలు లెక్కిస్తూ రైతులకు అన్యాయం చేస్తూందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన 400 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలు పనికి రావని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అవసరం ఏర్పడిన తక్షణం వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్,సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు దేవానందం,‌ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి,జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి,కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ రెడ్డి,పుష్పా నగేష్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్,యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సోమిరెడ్డి,దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి,కుమార్ గౌడ్, వెంకటేష్ గౌడ్,గోవర్ధన్ రెడ్డి,తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News