Thursday, October 3, 2024
Homeపాలిటిక్స్Zaheerabad: ఫార్మాసిటీ రద్దు చేసే వరకు పోరాటం

Zaheerabad: ఫార్మాసిటీ రద్దు చేసే వరకు పోరాటం

హరీష్ రావ్

న్యాల్ కల్ మండలంలోని డప్పుర్,మల్గి,వడ్డీ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కంపెనీ రద్దు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీష్ రావ్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు. గురువారం న్యాల్ కల్ మండలంలోని డప్పురు గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని భూనిర్వాసితులతో మాట్లాడి వారికి మద్దతు తెలుపుతూ సమస్యలు తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడుతూ బంగారం లాంటి మూడు పంటలు పండే భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి మంజీరను కలుషితం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏమాత్రం తగదన్నారు.హైదరాబాద్ సమీపంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం పదిహేను వేల ఎకరాలు కేటాయించగా పర్యావరణ,అటవీ అనుమతులు వచ్చినప్పటికీ న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడి పచ్చటి భూముల్లో ఫార్మసిటిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ప్రజలు దీనిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి పాలనంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆయన ఎద్దేవ చేశారు.రంగారెడ్డిలో ఫార్మసిటీ ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నిస్తే ఉందని చెప్పి అక్కడ మూడు నాలుగు వేల ఎకరాలలో ఫార్మా ఏర్పాటు చేసి మిగతా భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పన్నాగం వేశారన్నారు. ఇక్కడి భూ నిర్వాసితులకు అండగా ఉండి న్యాల్ కల్ లో ఫార్మాసిటీ రద్దు జరిగే వరకు అండగా ఉంటూ తాము పోరాటం చేస్తామని, నిర్వాసితులు కూడా ఎదురు తిరగాలని ఆయన పిలుపునిచ్చారు. మూసి సుందరి కరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని ఇదేనా ఇందిరామ రాజ్యామని ఆయన ప్రశ్నించారు.ఇందిరమ్మ గరీబి హటావో అంటే సీఎం రేవంత్ రెడ్డి కిసాన్ హటావో అంటూ పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలిస్తామన్న కాంగ్రెస్ ప్రస్తుతం రైతుల నుండి గుంజుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా,పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 పథకం తదితరాలను అమలు చేయకుండా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.జహీరాబాద్,నారాయణఖేడ్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను మంజూరు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి వాటిని నిలుపుదల చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి అభివృద్ధి కుంటుబడిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్,సంగారెడ్డి ఎమ్మెల్యేలు మాణిక్ రావ్,చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,డప్పూర్ మాజీ సర్పంచ్ మారుతి, నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News